మున్సిపాలిటీలోని పైలాన్ పార్క్ మూడేండ్లుగా వినియోగంలో లేదు. దాంతో పిచ్చి మొక్కలు పెరిగి అధ్వానంగా మారింది. పార్క్లోని బండలు సైతం పగిలిపోయాయి.
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి
చౌటుప్పల్, ఫిబ్రవరి14 : మున్సిపాలిటీలోని పైలాన్ పార్క్ మూడేండ్లుగా వినియోగంలో లేదు. దాంతో పిచ్చి మొక్కలు పెరిగి అధ్వానంగా మారింది. పార్క్లోని బండలు సైతం పగిలిపోయాయి. పార్క్ను తిరిగి ప్రారంభించాలని స్థానికుల విజ్ఞప్తి మేరకు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సోమవారం మున్సిపల్ అధికారులతో కలిసి పార్క్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథకు చిహ్నంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించబడిన పార్క్లో పెరిగిన పిచ్చి మొక్కలు, పగిలిన బండలను తొలగించి కొత్త బండలు వేయాలని సూచించారు.
మున్సిపాలిటీ ప్రజల సేద తీరుస్తున్న పార్క్లో వెంటనే అభివృద్ధి చేస్తామని తెలిపారు. వారం రోజుల్లో పైలాన్ పార్క్ను సుందరంగా తీర్చిదిద్ది వినియోగంలోకి తీసుకురానున్నట్లు చెప్పారు. పైలాన్ పార్క్ను తిరిగి వినియోగంలోకి తీసుకొస్తామని హామీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి కౌన్సిలర్ కామిశెట్టి శైలజాభాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్రెడ్డి, కౌన్సిలర్ కొరగాని లింగస్వామి, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుండెబోయిన వెంకటేశ్యాదవ్, నాయకులు తాడూరి పరమేశ్, బొడిగె బాలకృష్ణ, మునుకుంట్ల సత్యనారాయణగౌడ్, అంతటి బాలరాజుగౌడ్ ఉన్నారు.
ధర్మభిక్షం ఆశయాలు సాధించాలి
సంస్థాన్ నారాయణపురం : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎంపీ దివంగత బొమ్మగాని ధర్మభిక్షం ఆశయాలను సాధించాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో గీత పనివారల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్మభిక్షం శత జయంతి ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. ధర్మభిక్షం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచులు సుర్వి యాదయ్య గౌడ్, పొట్ట సత్యం, కొండ పద్మాశ్రీనివాస్రెడ్డి, గీత పనివారల సంఘం సభ్యులు యాదగిరి, యాదయ్య, గాలయ్య, సత్తయ్య, శ్రీరాములు పాల్గొన్నారు.
ఆర్థిక సాయం..
చౌటుప్పల్ : బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి భరోసానిచ్చారు. మున్సిపాలిటీ పరిధిలోని తంగెడపల్లికి చెందిన నిరుపేద కేతరాజు మహేశ్ స్థానిక పెట్రోల్ బంక్ పక్కన చికెన్ సెంటర్ ఏర్పాటుకు తాత్కాలిక షెడ్డు వేసుకున్నాడు. ఈ నెల 11న హెచ్ఎండీఏ అధికారులు అక్రమ కట్టడాల నెపంతో షెడ్డును కూల్చివేయగా బాధిత కుటుంబం లబోదిబోమన్నది. విషయం తెలుసుకున్న కూసుకుంట్ల సోమవారం బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి రూ.50వేల ఆర్థిక సాయం అందజేశారు. షెడ్డు నిర్మాణానికి సిమెంటు బస్తాలు, ఇటుకలు ఇప్పించి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. బాధితులు మాజీ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.