యాదాద్రి, ఫిబ్రవరి14: లక్ష్మీనృసింహుడి కల్యాణంతో పాతగుట్ట అపర వైకుంఠాన్ని తలపించింది. భక్తుల జేజేలు.. మేళతాళాలు.. వేద పండితులు, అర్చక బృందం, పారాయణికుల వేదఘోష నడుమ స్వామివారి వివాహ మహోత్సవం సోమవారం రాత్రి కనుల పండువగా జరిగింది. తుల లగ్న పుష్కరాంశ సుముహూర్తమున శ్రీనారసింహుడు అమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేసే అపూర్వ ఘట్టాన్ని అర్చకులు, వేదపండితులు వైభవంగా జరిపారు.
అంతకుముందే స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి గజవాహనంపై ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. కల్యాణ వేడుకను చూడడానికి భక్తులు వందలాదిగా తరలివచ్చారు. ముందుగా కల్యాణ మండపంలో విశ్వక్సేన ఆరాధన, స్వస్తి పుణ్యాహవాచనం చేసి సంప్రోక్షణ చేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త భాస్కరాయణి నరసింహమూర్తి, ఈఓ గీతకు కంకణ ధారణ చేశారు. స్వామివారికి బంగారు యజ్ఞోపవీతధారణ చేశారు. స్వామి అమ్మవార్లకు మధ్య తెరపత్రం ఉంచి జీలకర్ర బెల్లం ఘట్టాన్ని నిర్వహించారు.
అనంతరం ప్రత్యేక పూలమాలల దండలను మార్పిడి చేశారు. ప్రవరలను చెప్పి, నూతన వధూవరులకు కన్యాదానం చేశారు. వేదపండితులు, అర్చక బృందం, పారాయణికులు వేదఘోష నడుమ పాతగుట్ట లక్ష్మీనరసింహుడి కల్యాణ వేడుక కొనసాగింది. పెండ్లికొడుకు, పెండ్లి కూతురుగా స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ధన, కనక, వజ్ర, వైడూర్యాల ఆభరణాలు, పట్టువస్ర్తాలతో అమ్మవారిని, స్వామివారిని అలంకరించారు. జైజై నారసింహ.. జైజై లక్ష్మీనరసింహ అంటూ భక్తుల కోలాటాల మధ్య గజవాహన సేవ ఆసక్తిగా నడిచింది. వేదపండితుల వేదమంత్రోచ్ఛరణలతో బ్యాండు మేళాలు, కోలాట నృత్యాల నడుమ గజవాహనంపై స్వామి, అమ్మవార్లు ఆధ్యాత్మిక వాతావరణంలో కల్యాణ వేదిక వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు.
పారాయణాలు, నిత్యహవనాలు..
నిత్యపూజల అనంతరం సాయంత్రం 5 గంటలకు పారాయణాలు, నిత్య హవనాలను ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, అర్చకబృందం, పారాయణీకులు పాంచరాత్రాగమ శాస్త్రరీత్యా నిర్వహించారు. శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం అలంకారసేవ గజవాహనంపై ఆస్థాన మండపానికి వేంచేయగా ప్రధానార్చకబృందం పర్యవేక్షణలో యాజ్ఞిక బృందం, అర్చక బృందం వేదపండితులు సుముహుర్తంలో శ్రీస్వామి వారి అమ్మవారి కల్యాణ మహోత్సవ వేడుకల నిర్వహించారు. కల్యాణ విశేషాలను ప్రధానార్చకులు, వేదపండితులు వివరించారు. శ్రీస్వామివారి, అమ్మవారి వైభవాన్ని తెలియజేసే మహామంత్ర పుష్పపఠనం, చతుర్వేద పారాయణాలు మహదాశీర్వచనం నిర్వహించారు. అనంతరం కల్యాణ దంపతులగు శ్రీలక్ష్మీనరసింహస్వామి అలంకారణ సేవ భక్తుల భజన, కోలాటాలతో బ్యాండు మేళతాళాల మధ్య వేడుకగా నిర్వహించారు.
శ్రీవారి అనుగ్రహం..
శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం తిలకించిన భక్తులకు శ్రీవారి అనుగ్రహం లభిస్తుందని స్కంధపురాణంలో స్పష్టం చేసిన విషయాన్ని కల్యాణోత్సవ వ్యాఖ్యాత వివరించారు. సమస్త ప్రాణకోటికి, ప్రకృతి మండలానికి శ్రీలక్ష్మీనరసింహుడి అనుగ్రహం.. సకల ఆయురారోగ్యాలు కలుగుతాయని వేదాలు, ఇతిహాసాలలో కూడా పేర్కొనబడి ఉందని ఆయన తెలిపారు. స్వయంభూ పాంచరాత్రాగమ శాస్ర్తానుసారం కల్యాణోత్సవ నిర్వహించారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..
యాదాద్రి కూచిపూడి నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. విద్యార్థిని లింగాల ప్రణతి నృత్య భంగిమలు అలరించాయి.