సూర్యాపేట టౌన్, జూలై 22:పద్మశాలీ సం ఘం ఎన్నికలపై వాట్సాప్లో పెట్టిన మెసేజ్కు స్పందించిన వివాదం ఒక వ్యక్తి దారుణ హత్యకు దారి తీసిన ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…సూర్యాపేట పట్టణానికి చెందిన మానుపురి కృపాకర్(48) చెప్పుల వ్యాపారం నిర్వహిస్తుంటారు. వచ్చేనెల 3న నిర్వహించనున్న పద్మశాలీ సంఘం ఎన్నికలకు సంబంధించి ఆ సంఘం జిల్లా అధ్యక్షు డు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పం శ్రీనివాస్ సంఘానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టారు.
దానికి కృపాకర్ క్లాప్స్ కొడుతూ రీపోస్టు పెట్టాడు. దీనిని జీర్జించుకోలేని అదే కులానికి చెందిన మరోవర్గం నాయకుడు రాములు నువ్వు అలా ఎందుకు స్పందించావంటూ సోమవారం రాత్రి కృపాకర్కు ఫోన్ చేసి బండబూతులు తిట్టి చంపుతానని బెదిరించారు. ఈ విషయంపై కులపెద్దలకు ఫోన్లోనే ఫిర్యాదు చేశారు. కులసంఘం ఎన్నికల ఇన్చార్జికి, కులపెద్దలకు ఫిర్యాదు చేసి వారి సంక్షేమం లో సమస్యను పరిష్కరించేందుకు మంగళవారం కులసంఘం భవనానికి వెళ్లారు.
అప్పటికే పద్మశాలీ భవనం వద్ద ఉన్న శ్రీరాముల రాములు అతడి కుమారుడు ధనుంజయ్లతోపాటు మరో నలుగురు వ్యక్తులు కృపాకర్పై దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన కృపాకర్ను వారే చికిత్స నిమిత్తం ఏరియా దవాఖానకు తరలించగా మార్గమధ్యంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. అందరితో కలివిడిగా ఉంటే వ్యక్తి హత్యకు గురి కావడంపై ఏరియా దవాఖానలో బం ధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి భార్య విజయలక్ష్మి, కుమార్తె అమూల్య, కుమారుడు అజయ్ ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటయ్య తెలిపారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి: అప్పం శ్రీనివాస్
కుల సంఘం ఎన్నికలప పెట్టిన మెసేజ్కు స్పందించిన పాపానికి అతి దారుణంగా కృపాకర్ను చంపడం అమానుషమని, ఈ హత్యకు ఒడికట్టిన శ్రీరాముల రాములు, అతడి కుమారుడు ధనుంజయ్లతోపాటు వారికి సహకరించిన నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు అప్పం శ్రీనివాస్, సభ్యులు డిమాండ్ చేశారు.