నందికొండ, డిసెంబర్ 9 : తెలంగాణ, ఆంధ్రా రాష్ర్టాలకు సాగు, తాగు నీటిని అందిస్తూ అన్నపూర్ణగా విరాజిల్లుతున్న నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు పునాదిరాయిపడి నేటికి 68 ఏండ్లు పూర్తయ్యాయి. దాంతో సాగర్ ప్రాజెక్ట్ ప్రస్తుతం 69వ వసంతంలోకి అడుగిడింది. రైతులు కరువుతో విలవిల్లాడుతున్న సమయంలో ముక్త్యాల కోట రాజైన రాజా రామగోపాల్ కృష్ణ మహేశ్వరప్రసాద్ ఆలోచనతో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి బీజం పడింది.
1908న కృష్ణా నదిపైన పులిచింతల వద్ద ప్రాజెక్ట్ కట్టేందుకు అనువుగా ఉందని బ్రిటీశ్ ఇంజినీర్లు కర్నల్ ఎల్లిస్, సీటీ మార్లింగ్స్ తెలిపినప్పటికీ కొన్ని అనివార్య కారణల వల్ల అప్పట్లో ప్రాజెక్ట్ నిర్మాణం ఆగిపోయింది. అనంతరం ఖోస్లా కమిటీ సూచనలతో 1954 డిసెంబర్ 17న అప్పటి గవర్నర్ త్రివేది నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించారు. 1955 డిసెంబర్ 10న ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రాజెక్ట్ నిర్మాణానికి నందికొండలోని పైలాన్కాలనీలో పిల్లర్ ఏర్పాటు చేసి శంకుస్థాపన చేశారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్మించిన ప్రాంతానికి పురాణకాలం నుంచి ఘనమైన చరిత్ర, ఎనలేని ప్రాశస్త్యం ఉంది. మహాయన మాధ్యమిక ప్రముఖుడు ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతంలో బౌద్ధరామం నెలకొల్పి, దేశ విదేశాల విద్యార్థులకు విద్యను బోధించడంతో ఈ ప్రాంతం అంతర్జాతీయ స్థాయిలో విశ్వ విద్యాలయంగా వెలుగొందింది. దాంతో ఈ ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్ట్కు ఆచార్య నాగార్జునుడి పేరుతో నాగార్జునసాగర్ డ్యాంగా పెట్టారు. తెలంగాణ ఏర్పాటయ్యాక గత ప్రభుత్వం నాగార్జునసాగర్ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడంతో పాటు గత చరిత్రను భావితరాలు గుర్తుంచుకునేలా దీనికి నందికొండ మున్సిపాలిటీగా పేరు పెట్టింది.
1930లో నల్లగొండ, ఖమ్మం జిల్లాల రైతులకు సాగునీటిని అందించేందుకు ప్రాజెక్ట్ నిర్మించాలని భావించిన ఆనాటి నైజం నవాబు మద్రాసు, బ్రిటిశ్ ప్రభుత్వాన్ని అనుమతి కోరగా అది కార్యరూపంలోకి రాలేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆలోచన మొదలైంది. సముద్రమట్టానికి 546 అడుగుల ఎత్తులో ఆనకట్ట నిర్మించి నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీటిని అందించాలని భావించారు. నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని మొదటగా చీఫ్ ఇంజినీర్ అలీనవాబ్ జంగ్ సర్వే చేసి పథకాన్ని రూపొందించారు. డ్యాంతో పాటు ఎడమ, కుడి కాల్వలు, ప్రధాన డ్యాం వద్ద జలవిద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసి 1.63 లక్షల కిలోవాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసేలా డ్యాంను నిర్మించారు.
రాతి కట్టడం పొడవు 4,758 అడుగులు, 408 అడుగుల ఎత్తుతో, అడుగున 287.9 నుంచి 300 అడుగుల వెడల్పుతో 79 బ్లాకులుగా ప్రాజెక్ట్ నిర్మించారు. రెండు నాన్ ఓవర్ ప్లో సెక్షన్ల మధ్య 546 అడుగుల పైన 45, 44 అడుగులతో 26 రేడియల్ క్రస్ట్ గేట్లను ఇంజినీర్ కేఎల్రావు పర్యవేక్షణలో అమర్చారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు చేరుకున్నపుడు 26 క్రస్ట్ గేట్ల ద్వారా 11,70,000 క్యూసెక్కుల వరద నీటిని ప్రధాన డ్యాం దిగువ భాగంలో 1540 అడుగుల నిడివి గల స్పిల్వే మీదుగా దిగువకు విడుదల చేసేలా రూపొందించారు.
నల్లగొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో నందికొండ గ్రామం వద్ద కృష్ణానదిపై బహులార్థక సాధక ప్రాజెక్ట్గా నాగార్జునసాగర్ను నిర్మించారు. ఆధునిక దేవాలయంగా కీర్తించబడుతున్న మానవ నిర్మిత అతి పెద్ద రాతికట్టడం కావడంతో ఈ ప్రాజెక్ట్ చరిత్ర పుటల్లో నిలుస్తోంది. ఈ ప్రాజెక్ట్తో తెలంగాణ, ఆంధ్రా రాష్ర్టాల్లోని 25 లక్షల ఎకరాల భూమి సాగులోకి వస్తుండడంతో వేల రైతు కుటుంబాలు పాడి పంటలతో సంతోషంగా జీవనం సాగిస్తున్నాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ద్వారా చేపడతున్న విద్యుత్ ఉత్పత్తితో పరిశ్రమల మనుగడ కొనసాగుతుండడంతో వేల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి.
రతీయ ఇంజినీర్లు తమ ప్రతిభతో మొట్టమొదటిసారిగా అతి పెద్ద రాతి కట్టడమైన నాగార్జునసాగర్ డ్యాంను నిర్మించి యావత్ ప్రపంచ సాంకేతిక లోకమే అబ్బుర పడేలా చేశారు. ప్రపంచంలోనే రాతి అనకట్టల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ మొదటిది. 1955 నుంచి 1967 వరకు దాదాపు 12 సంవత్సరాల పాటు పూర్తిగా స్వదేశీయ ఇంజినీర్ల పరిజ్ఞానంతో, లక్షలాది మంది కూలీల భాగస్వామ్యంతో ప్రాజెక్ట్ నిర్మించారు. డ్యాం నిర్మాణ సమయంలో ప్రతిరోజు దాదాపు 500 మంది ఇంజినీర్లు, 500 మంది వర్కుచార్జ్ ఉద్యోగులు, 40 వేల మంది కూలీలు పనులు నిర్వహించేవారు.
సాగు, తాగునీటి అవసరాల కోసం కుడివైపు జవహర్ కాల్వను, ఎడమవైపు లాల్బహద్దూర్ కాల్వను ఏర్పాటు చేశారు. ఈ కాల్వల ద్వారా 18.94 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నారు. ఈ కాల్వలకు 132 టీఎంసీల నీటిని కేటాయించారు. 1967 ఆగస్టు 4న ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా నిర్మించారు. ఆనాటి భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి విద్యుత్కేంద్రాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
నాగార్జునసాగర్ జలాశయ విస్తీర్ణం 110 చదరపు మైళ్లు. గరిష్ట నీటి మట్టం 590 అడుగులకు 408.24 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. అయితే పూడిక వల్ల ప్రస్తుత నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు చేరుకుంది. డెడ్స్టోరేజీ 490 అడుగులు. రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలంటే కనీసం నీటిమట్టం 510 అడుగులు ఉండాలి.
డ్యాంసేఫ్టీ రివ్యూప్యానల్ కమిటీ సూచనల మేరకు నాగార్జునసాగర్ ఆధునీకరణలో భాగంగా డ్యాంకు పూర్తి స్థాయిలో మరమ్మతులు నిర్వహించారు. ఈ ఏడాది రూ. 20 కోట్ల వ్యయంతో స్పిల్వే పనులు పూర్తి చేశాం. డ్యాం నిర్వహణను పటిష్ట పర్చాం. ఈ ఏడాది కృష్ణానదిలో నీటి లభ్యత లేనందున తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని వినియోగిస్తున్నాం.
– ధర్మానాయక్, నాగార్జునసాగర్ డ్యాం ఎస్ఈ