సూర్యాపేట, జూలై 12(నమస్తే తెలంగాణ) : మూడు దశాబ్దాల కాలంలో ఏనాడూ వరుసగా ఐదేండ్లు నిండని మూసీ ప్రాజెక్టు.. స్వరాష్ట్రంలో రికార్డులు తిరగరాస్తున్నది. 2016 నుంచి నిండుకుండలా తొణికిసలాడుతూ కుడి, ఎడమ కాల్వల ద్వారా ఏటా 40వేల ఎకరాల ఆయకట్టును సస్యశ్యామలం చేస్తున్నది. వాస్తవానికి వానకాలం పంటకు మాత్రమే ఉద్దేశించినా ప్రాజెక్టు అయినా.. గేట్ల మరమ్మతులు, సమృద్ధిగా కురుస్తున్న వానలతో రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి రెండు కార్లకు నీళ్లందిస్తున్నది. తాజాగా వానకాలం సీజన్కు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సోమవారం నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 645 అడుగల మేరకు నీళ్లున్నాయి. 1,600 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నది. సీజన్కు ముందే ప్రభుత్వం నుంచి పంట పెట్టుబడి సాయం అందుకున్న ఆయకట్టు రైతాంగం.. ఇప్పుడు సాగునీటి విడుదలతో సంతోషం వ్యక్తం చేస్తున్నది. వ్యవసాయం దండుగ అన్న దగ్గర నుంచి వ్యవసాయమే పండుగ అనే స్థాయికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చారు. సాగునీరు, విద్యుత్తు, సకాలంలో విత్తనాలు, ఎరువులతో పాటు పంట పెట్టుబడి సాయం కూడా అందిస్తున్న విషయం విదితమే. దీంతో రైతాంగం నేడు ఇతరుల మాదిరే..మాకు ఆదాయం వస్తుందనే ధీమాతో ఉన్నది. ప్రాజెక్టు ఉండి కూడా యేండ్ల తరబడి నీటికి ఎరుగని ప్రాంతాల్లో సైతం నేడు పచ్చని పైర్లు పండుతున్నాయి. దానికి ఉదాహరణే జిల్లాలోని మూసీ నది. ప్రకృతి కరుణిస్తున్నది.. వెరసి మూసీ ఆయకట్టు రైతుల పంట పండుతోంది.
640.79 అడుగుల మేర నీరు
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి సోమవారం 1790.35 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చింది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగు తూ సాయంత్రానికి 640.79(3.40 టీఎంసీలు) అడుగులకు పెరిగింది. 51 క్యూసెక్కుల నీరు ఆవిరవుతున్నది. కుడి, ఎడమ కాల్వలకు కలిపి 200 క్యూసెక్కులను విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645(4.46 టీఎంసీలు)అడుగులుగా ఉన్నట్లు ఏఈ ఉదయ్ తెలిపారు.
ఇన్ ఫ్లోను బట్టి నీటి విడుదల
మూసీ నదికి వచ్చే ఇన్ ఫ్లోను బట్టి కాల్వలకు నీటి విడుదల ఉంటుంది. ప్రస్తుతం మూసీకి 1,600 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. మరింత పెరిగితే నీటి విడుదలను పెం చుతాం. నదిలో నీళ్లు నిండుగా ఉండేలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే రెండో పంట అయిన యాసంగికి ఢోకా ఉండదు. లీకేజీల విషయానికి వస్తే ఇంత పెద్ద ప్రాజెక్టుకు కొద్దిమేర ఉండడం సాధారణమైన విషయమే. అయినప్పటికీ ఎప్పటికప్పుడు లీకేజీలను అరికడుతున్నాం. తాజాగా నీటి లీకేజీలను అరికట్టేందుకు నిపుణులు వచ్చారు. – చంద్రశేఖర్, మూసీ డీఈ