ఆలేరు పట్టణానికి సమీపంలో ఉన్న కొలనుపాక చండీ సమేత సోమేశ్వరాలయం దక్షిణ కాశీగా, మహా శైవ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ 18 మఠాలు భిన్న మతాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి. క్రీ.శ. 5నుంచి 15 శతాబ్దాల కాలం నాటి శిల్పాలు, గజలక్ష్మి, ధ్వజస్తంభం, చాముండి, నటరాజు, భైరవుడు, నాగశిల్పం, సప్తమాతృకలు, వీరభద్రులు, భద్రకాళి, ఆరో విక్రమాదిత్యుడి శాసనాలు ఉన్నాయి. ఇక్కడ లభ్యమైన సరస్వతీదేవి, సప్త మాత్రికలు, కోష్టపంజరం, కోదండరాముడు, వీరగల్లు, సూర్యుడు, అష్టలక్ష్మి విగ్రహాలు ఎంతో అరుదైనవి. హనుమంతుడి కుమారుడిగా చెప్పుకొనే మత్స్యవల్లభుడి విగ్రహం కూడా ఇక్కడ ఉన్నది. ఇలాంటివి దేశంలో ఎక్కడా లేకపోవడం విశేషం. బౌద్ధ, జైన మతాలకు సంబంధించి గౌతమబుద్ధుడు, మహావీరుడి విగ్రహాలు సైతం బయటపడ్డాయి. ఆలయానికి నిత్యం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి దర్శించుకుంటారు. తెలంగాణతోపాటు ఇతర రాష్ర్టాల భక్తులు సైతం వస్తుంటారు.
అంతా సంప్రదాయ పద్ధతులతోనే..
ఆలయ పనులన్నీ సంప్రదాయ పద్ధతిలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. అనేక చోట్ల గ్యాప్లు ఉండటంతో వర్షం వచ్చినప్పడు నీరు లీకేజీ అయ్యేది. ఎక్కడెక్కడ లీకేజీ అవుతుంది.. ఎక్కడెక్కడ గ్యాప్ ఉంది అనేది విశ్లేషించారు. ఆ తర్వాత కప్పు మొత్తం సంప్రదాయ సున్నంతో ఫిల్ చేశారు. గ్యాప్స్ మధ్యలో కర్రలతో కొట్టి నింపారు. ఈ సున్నం.. కుంకుడుకాయ, కరక్కాయ, ఇటుక పొడి, సున్నం పొడి సన్నగా చేసి తయారు చేస్తారు. విగ్రహాలు, బొమ్మలకు చేతులు, కాళ్లు విరిగిపోయిన చోట ఈ సున్నంతో తీర్చిదిద్దుతున్నారు. దీనిపై ప్రొటెక్టివ్ కోట్ వేస్తున్నారు. దాంతో నీళ్లు పడినా చెట్లు, పాకూరు పెరుగడానికి వీలుండదు. రూఫ్ పైన చిన్నచిన్న రంధ్రాల వద్ద ఇటుకలు కడుతున్నారు. దానికి డంగు సున్నం ఉపయోగిస్తున్నారు.
రూ.1.79కోట్లతో ఆలయ పునరుద్ధరణ
రాష్ట్రంలో ఆలయాల పునరుద్ధరణకు రాష్ట్ర సర్కారు నడుం బిగించింది. ఇందులో భాగంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్ అత్యద్భుతంగా తీర్చిద్దిద్దారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం తర్వాత సోమేశ్వరాలయానికి నిధులు విడుదల చేస్తానని సీఎం కేసీఆర్ గతంలోనే హామీ ఇచ్చారు. తెలంగాణ రాక ముందు కూడా ఆలయాన్ని స్వయంగా దర్శించి పునర్నిర్మాణానికి సహకరిస్తానని చెప్పారు. అందులో భాగంగా కొలనుపాక ఆలయ పునరుద్ధరణకు 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.1.79కోట్లు మంజూరు చేశారు. దాంతో ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించిన అధికారులు.. ఈ ఏడాది ఫిబ్రవరి 16న పనులు ప్రారంభించారు.
గత వైభవం దెబ్బతినకుండా..
గతంలో ఆలయం, ప్రాంగణమంతా అస్తవ్యస్తంగా ఉండేది. రాళ్లు, రప్పలు కుప్పలుగా కనిపించేవి. చెట్లు దర్శనమిచ్చేవి. పనుల్లో భాగంగా వీటిని పూర్తిగా తొలగించారు. సుమారు నెలపాటు క్రేన్ సహాయంతో 1652 రాళ్లను తొలగించారు. అందులో పిల్లర్లు, సూరు బండలు, బీములు, పిల్లర్ క్యాపిటల్స్, ఇరిగిపోయిన రాళ్ల ముక్కలు దొరికాయి. 5 ఫీట్ల జైన పాదం మట్టిలో ఉండగా.. దాన్ని తీసి నిలబెట్టారు. ఆలయ పునరుద్ధరణలో భాగంగా గత వైభవం దెబ్బతినకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక్క ప్రతాపరుద్రుడి విగ్రహం మినహా అన్నింటికీ పాత రాళ్లనే ఉపయోగించారు. పాత రాళ్లతోనే కన్జర్వేషన్ చేస్తున్నారు. నంది మండపాల్లో ఉన్న నందుల దగ్గర మెడ వరకు మట్టి ఉండేది. దాన్ని జాగ్రత్తగా తొలగించారు. ఇక్కడ ఓ శాసనం కూడా దొరికింది.
మూడు బృందాలతో ముమ్మరంగా పనులు
ఆలయంలో పునరుద్ధరణ పనులు మూడు బృందాలతో కొనసాగుతున్నాయి. మొత్తం 60మంది పని చేస్తున్నారు. గోపురం పనులు చేయడానికి చెన్నై నుంచి 20మంది స్కిల్డ్ లేబర్ను రప్పించారు. గోపురంపై శైవాగమనానికి సంబంధించి శివుడి రూపాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి కాళ్లు, చేతులు పోయాయి. ఇవి మరమ్మతు చేయడానికి చెన్నై నుంచి స్పెషల్ టీమ్ను తీసుకొచ్చారు. స్టోన్ వర్కర్లు 20మంది, కన్జర్వేషన్ సివిల్ వర్క్ కోసం 20 మంది పనుల్లో నిమగ్నమయ్యారు. రాళ్లను ఎత్తడానికి భారీ క్రేన్లు వాడుతున్నారు. గోపురం కోసం లడ్డాఖ్ నుంచి ప్రత్యేకంగా ఆర్టిస్ట్ను రప్పించారు. ఇప్పటికే పనులు తుది దశకు చేరుకున్నాయి. మరో 20 రోజుల్లో ఆకృతుల్లో మార్పు వస్తుందని, నెల రోజుల్లో మొత్తం పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.
ఫ్లోరింగ్, పిల్లర్ల రీ సెట్టింగ్
గతంలో వేసిన సిమెంట్, టైల్స్, అదనంగా కట్టిన గోడలను తొలగించారు. 12వ శతాబ్దం మండపం కావడంతో స్తంభాలు కిందికి దిగాయి. రూఫ్ స్ట్రక్చర్ కూడా కిందికి ఒరిగింది. మండపంలో రాళ్లను తీసి రీసెట్టింగ్ చేశారు. కింద కప్పురాళ్లను తొలగించి పిల్లర్లను పైకి లేపారు. కక్షాసన రాళ్లను ఉన్నది ఉన్నట్లుగా పెట్టారు. ఈ పనులు ఇంకా జరుగుతున్నాయి. ప్రతి గుడిలో ఫ్లోరింగ్ రీసెట్టింగ్ చేశారు. కోటి లింగాల గర్భగుడిలో గతంలో టైల్స్ ఉండేవి. అవి తీసేసి ఫ్లోరింగ్ రీ సెట్టింగ్ చేశారు. ఇప్పుడు శివలింగం ఎత్తులో మంచిగా కనిపిస్తున్నది. ఇక ప్రతాపరుద్రుడి విగ్రహం భారీ క్రేన్ సహాయంతో కూర్చోబెట్టనున్నారు. ఆ తర్వాత మంటపం పూర్తి చేస్తారు. దానికి మొదటి నుంచి రూఫ్ లేదు. రూఫింగ్ వర్క్ చేస్తారు. ప్రస్తుతం లైన్ కాంక్రీట్ పూర్తయింది. దానిపైన ఇంకో ఫైనల్ ఫినిషింగ్ టైల్స్ వస్తాయి. నీళ్లు కిందికి రాకుండా సంప్రదాయ పద్ధతిలో టైల్స్ వేస్తున్నారు.
తళతళ మెరిసేలా..
ఆలయ పునరుద్ధరణ పనుల్లో స్టోన్ క్లీనింగ్ ప్రత్యేకమైంది. సాధారణంగా స్టోన్ క్లీనింగ్కు సాండ్ బ్లాస్టింగ్ వాడుతారు. కానీ కన్జర్వేషన్ రూల్స్ ప్రకారం ఇక్కడ ఎలాంటి సాండ్ బ్లాస్టింగ్ వాడటంలేదు. వాటర్ జెట్ ప్రెజర్తోనే ఒక స్పెషల్ మిషన్ తీసుకొచ్చి.. వివిధ రకాల పద్ధతులతో వినియోగించారు. వాటర్ ప్రెజర్ ద్వారా మాత్రమే క్లీన్ చేస్తున్నారు. గతంలో నాలుగైదు ఏండ్లకోసారి సున్నం వేసుకుంటూ పోయారు. ప్రత్యేకంగా బ్లేడ్ వాడి సున్నాన్ని చెక్కారు. లైమ్ వాష్ చేశారు. దీంతో ఒరిజినల్ లేయర్ వచ్చింది. పాకూరును కూడా తొలగించారు. గోపురంపై ఉన్న వేర్లు, చెట్టును స్ట్రక్చర్ దెబ్బతినకుండా మెల్లగా తీసేశారు. పిల్ల వేర్లు కూడా పెరుగకుండా యాసిడ్ పోస్తున్నారు.
నెల రోజుల్లో పనులు పూర్తి
కొలనుపాక ఆలయప్రాంగణంలో గతంలో రాళ్లు, రప్పలు కుప్పలుగా ఉండేవి. ఫిబ్రవరి 16న ఆలయ పనులు ప్రారంభించాం. ఆ తర్వాత ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్త్తున్నాం. ప్రతి పనినీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాం. పిల్లర్లు, ఫ్లోరింగ్ రీసెట్టింగ్ చేశాం. కన్జర్వేషన్ రూల్స్ ప్రకారమే పనులు కొనసాగుతున్నాయి. ఎక్కడా ఆలయ వైభవం దెబ్బతినకుండా పూర్వ వైభవం వచ్చేలా పనులు జరుగుతున్నాయి. సంప్రదాయ పద్ధతులను ఉపయోగిస్తున్నాం. ఇప్పటికే 80శాతం పనులు అయిపోయాయి. మరో నెల రోజుల్లో పునరుద్ధరణ పనులు పూర్తవుతాయి.
– శ్రీలేఖ, ఆర్కిటెక్ట్
టీఆర్ఎస్ కొలనుపాకకు పూర్వ వైభవం
వైటీడీఏ ద్వారా కొలనుపాకలోని సోమేశ్వరాలయానికి నిధులు కేటాయించడం హర్షణీయం. ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తయితే కొలనుపాకకు పూర్వ వైభవం వస్తుంది. గత ప్రభుత్వాలు ఆలయాన్ని పట్టించుకోలేదు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతోపాటు టీఆర్ఎస్ అధికారంలో ఉండడం వల్ల ఎంతో చరిత్ర కలిగిన సోమేశ్వరాలయానికి మహర్దశ పట్టింది.
– ఆరుట్ల లక్ష్మీప్రసాద్రెడ్డి, కొలనుపాక గ్రామ సర్పంచ్
భక్తుల సంఖ్య పెరుగనున్నది
కొలనుపాక సోమేశ్వరాలయ పునరుద్ధరణ పనులు పూర్తయితే భక్తుల సంఖ్య పెరుగనుంది. యాదగిరిగుట్ట తరహాలో కొలనుపాకలోని అన్ని ఆలయాలను అభివృద్ధి చేయాలి. సోమేశ్వరాలయంలో ప్రతి కూలానికీ ఒక మఠం ఉంది. జీర్ణోద్ధరణ పనులు నాణ్యతగా వేగంగా పూర్తి చేయాలి.
– మిట్టపల్లి వీరస్వామి, కొలనుపాక గ్రామస్తుడు