నీలగిరి, మార్చి 04 : నల్లగొండ II టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ప్రతిభావంతమైన కబడ్డీ క్రీడాకారిణి షైక్ నౌషీన్ ఆల్ ఇండియా పోలీస్ స్స్పోర్ట్స్ అండ్ గేమ్స్ – 2026 మీట్కు ఎంపికైంది. ఈ ప్రతిష్టాత్మక పోటీలు జమ్మూ అండ్ కశ్మీర్లో ఈ నెల 7 నుండి 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ కబడ్డీ క్రీడా పోటీలకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తరపున కెప్టెన్గా షైక్ నౌషీన్ బాధ్యత వహించనున్నారు. 4వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ – 2026 పోటీలు ఫిబ్రవరి 16 నుండి 21 వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించబడ్డాయి. ఈ క్రీడా పోటీలలో యాదాద్రి -V జోన్ జట్టు తరఫున కబడ్డీలో బంగారు పతకం సాధించగా, 3వ పోలీస్ స్టేట్ మీట్ తరఫున రజత పతకం సాధించారు. ఈ రెండు సందర్భాల్లోనూ జట్టుకు కెప్టెన్గా షైక్ నౌషీన్ నాయకత్వం వహించి విశిష్ట ప్రతిభ కనబరిచింది.
షైక్ నౌషీన్ ఇప్పటివరకు 20 సార్లు జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొని విశేష ప్రతిభ కనబరిచింది. అదేవిధంగా 3 సార్లు ఇండియన్ క్యాంప్స్లో పాల్గొని తన నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకుంది. 2025లో పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ నగరంలో నిర్వహించిన ఆల్ ఇండియా పోలీస్ మీట్లో తెలంగాణ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి జట్టును విజయవంతంగా నడిపించింది. ఈ సందర్భంగా షైక్ నౌషీన్ ను అభినందిస్తూ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జమ్మూ అండ్ కశ్మీర్లో జరుగనున్న ఆల్ ఇండియా పోలీస్ మీట్లో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి మరింత గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లా పోలీస్ శాఖ తరఫున ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.