రామగిరి, జనవరి 25 : ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు పూర్తి చేశారు. డీఈఓ కార్యాలయంలో వివిధ మండలాల ఎంఈఓలు హాజరై వివిధ కేటగిరిలో ఖాళీలు, అర్హులైన వారి జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే నల్లగొండ జిల్లాలో ఖాళీల జాబితాను అధికారులు వెల్లడించారు. ఈ నెల 27 నుంచి ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో అంతకంటే ముందే సీనియారిటీ జాబితాను ప్రకటించేందుకు చర్యలు చేపడుతున్నారు.
వెబ్సైట్లో సీనియారిటీ జాబితా
ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు బుధవారం కసరత్తు చేసిన అధికారులు రాత్రి జీహెచ్ఎం జాబితాను డీఈఓ వెబ్సైట్ల్లో అందుబాటులో ఉంచారు. జిల్లాలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్, తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయుల తాత్కాలిక సీనియార్టీ జాబితాను విద్యాశాఖ అధికారులు తయారు చేశారు. అందుకు సంబంధించిన జాబితాను deonalgonda.blogstop.com వెబ్సైట్ల్లో పొందుపర్చారు. అదే విధంగా స్కూల్ అసిస్టెంట్, మిగిలిన క్యాడర్స్కు సంబంధించి అర్హులైన వారి జాబితాను అర్ధరాత్రి వరకు ప్రకటిస్తామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్గా సుమారు 4 వేలకు పైగా ఉపాధ్యాయులు పదోన్నతి పొందే అవకాశం ఉంది.
కటాఫ్ తేదీల వివరాలు
ప్రభుత్వ పాఠశాలల విభాగంలో మొదట నియామకమైన ఉపాధ్యాయులకు జనరల్, ఎస్సీలకు 2001, ఎస్టీ 2006, పీహెచ్సీ 2019గా నిర్ణయించారు. లోకల్ బాడీ మేనేజ్మెంట్ విషయంలో మొదట నియామకమైన ఉపాధ్యాయులకు జనరల్, ఎస్సీ 2002, ఎస్టీ 2007, పీహెచ్సీ 2019గా నిర్ణయించారు. ఆయా తేదీలోపు నియామకమైన వారి జాబితాలను సిద్ధం చేసినట్లు తెలిసింది.
నేడు ధృవపత్రాల పరిశీలన
స్కూల్ అసిస్టెంట్, అదే క్యాటగిరీలో నియామకమైన వారి జాబితాలను కటాఫ్ తేదీల ప్రకారం తాత్కాలిక జాబితాను తయారు చేసి వెల్లడించారు. వీరికి ఈ నెల 26న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నల్లగొండ డీఈఓ కార్యాలయంలో ధ్రువ పత్రాలు పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విభాగంలో 50 మంది, లోకల్ బాడీ పాఠశాలల్లో 384 మందిని గుర్తించారు.
ధ్రువపత్రాలన్నీ తప్పనిసరి
ధ్రువపత్రాల పరిశీలనకు వచ్చే వారు ఒరిజినల్ సర్వీస్బుక్, ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, బీఈడీ, పండిత్ ట్రైనింగ్ ఒరిజినల్ సర్టిఫికెట్స్, డిపార్టుమెంట్ పరీక్షల ఫలితాలు, ఎస్సీ, ఎస్టీ ఒరిజినల్ సర్టిఫికెట్స్, పీహెచ్సీ అయితే సంబంధిత ధ్రువపత్రాలు తీసుకు రావాలని డీఈఓ తెలిపారు.
నిర్ణీత సమయానికి హాజరు కావాలి
పాఠశాల విద్యా జాయింట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు నల్లగొండ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్, దాని సమానమైన కేటగిరీలో పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైంది. అందుకు సంబంధించి తాత్కాలిక జాబితాను డీఈఓ వెబ్సైట్లో అందుబాటులో ఉంచాం. ప్రభుత్వ, లోకల్ బాడీ విభాగాల్లో గుర్తించిన ఉపాధ్యాయులకు డీఈఓ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ధృవపత్రాలు పరిశీలిస్తాం. అందుకు సంబంధించి అర్హులైన వారికి సమాచారం అందించాం.
– బి.భిక్షపతి డీఈఓ నల్లగొండ