చిట్యాల, అక్టోబర్ 04 : ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం అలైన్మెంట్ మారదని, రెండు నెలల్లో రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ లోపు టెండర్లు పూర్తి చేసి జనవరిలో పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. శనివారం చిట్యాలలో మంత్రి మీడియాతో మాట్లాడారు. 2017- 18లో ప్రధాని మోదీ ఉత్తర భాగం రీజినల్ రింగ్ రోడ్డుకు అంగీకరించినట్లు తెలిపారు. తాను మంత్రిగా అయిన కొత్తలో 6 శాతం భూసేకరణ మాత్రమే అయితే రైతులను ఒప్పించి ఇప్పుడు 98 శాతం పైగా పూర్తి చేసినట్లు వెల్లడించారు. 4 లేన్ల RRR 2035 నాటికి ట్రాఫిక్ రద్దీ పెరుగుతుందని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా 6 లేన్లుగా మార్చుకున్నట్లు తెలిపారు.
సంగారెడ్డి నుండి నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవపూర్ వయా భువనగిరి, చౌటుప్పల్ వరకు 161.518 కిలో మీటర్ల నార్త్ పార్ట్ ఉండనుందన్నారు. భూసేకరణ కోసం రూ.6 వేల కోట్లు ఖర్చు అవుతుండగా కేంద్రం, రాష్ట్రం చెరో సగం వాటా ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.3 వేల కోట్లు హడ్కో రుణం తెచ్చామన్నారు. ఇప్పటికే పలుమార్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశామని, ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమై పనులు వేగవంతం చేసేలా మాట్లాడినట్లు చెప్పారు. ఉత్తర భాగం అలైన్మెంట్లో ఎలాంటి మార్పు ఉండదని, జనవరిలో పనులు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. అందుకు కేంద్రం సహకరించాలని కోరారు.
రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం విషయంలో బాధిత రైతులు అనవసర ఆందోళన చెందొద్దన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్ అండ్ బి మినిస్టర్ అయిన తాను రైతుల అంగీకారంతోనే ముందుకు పోతామని భరోసా ఇచ్చారు. తాను రైతు బిడ్డనేనని..రైతుకు అన్యాయం జరిగితే ఊరుకుంటానా? త్వరలోనే ముఖ్యమంత్రితో మాట్లాడి మంత్రుల కమిటీ వేస్తామని తనను కలిసిన రైతులకు ఆయన హామీ ఇచ్చారు. అయితే ఇటీవల పత్రికల్లో, సోషల్ మీడియాలో రీజినల్ రింగ్ రోడ్డు విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారని రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అక్కర్లేదన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ, నిర్మాణం కోసం రూ.45 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందన్నారు. పలువురు అబద్ధపు ప్రచారాలతో రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారని, వాళ్ల ట్రాప్ లో పడొద్దని రైతులను కోరారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యక్తిగతంగా తనను ఇష్టపడే వ్యక్తి అని తన పేరు చెప్పి గౌరెల్లి – భద్రాచలం హైవే, ఎల్బీనగర్ – మల్కాపురం రోడ్డు జీఓ ఇచ్చారని గుర్తు చేశారు. హైదరాబాద్ – విజయవాడ హైవే 8 లేన్ల నిర్మాణ పనులు వచ్చే ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. రీజినల్ రింగ్ రోడ్డు విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అక్కర్లేదని, రైతులు ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. అలైన్మెంట్ విషయంలో పెద్ద వాళ్లకు ఒక న్యాయం, పేదవాళ్లకు మరొక న్యాయం ఉండదని, అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని తేల్చి చెప్పారు. “నల్లగొండ బిడ్డగా..ఈ గడ్డకు అన్యాయం జరిగితే ఊరుకోను” అని మంత్రి కోమటిరెడ్డి పునరుద్ఘాటించారు.
చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివారులోని హోటల్లో ట్రిపుల్ ఆర్ రైతులతో మంత్రి మాట్లాడుతూ.. త్రిబుల్ ఆర్ సౌత్ పోర్షన్ కి డీపీఆర్ మాత్రమే అయిందని, ఎలాంటి అలైన్మెంట్ జరగలేదని స్పష్టం చేశారు. అలైన్మెంట్ అయినట్టు, రైతుల భూములు పోతున్నట్టు వివిధ పత్రికల్లో, సోషల్ మీడియాలో వచ్చినా అపోహలను ఎవరూ నమ్మొద్దన్నారు. డిసెంబర్లో అలైన్మెంట్ అయిన తర్వాత సీఎంతో మాట్లాడి, మంత్రులతో చర్చించి రైతులకు న్యాయం చేస్తానని తెలిపారు. ఆయా గ్రామాల్లో భూములు కోల్పోతున్న రైతులతో గ్రామ సభలు ఏర్పాటు చేసి రైతుల నిర్ణయాలు తీసుకుని వారిని ఒప్పించి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అలైన్మెంట్ ప్రకారం రోడ్డు పనుల్లో పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినా, రాజకీయ నాయకుల భూములు వచ్చినా ఎలాంటి మార్పులు ఉండవన్నారు. దివిస్ కంపెనీ కోసం అలైన్మెంట్ మారుస్తున్నట్లు పత్రికలలో వచ్చిన వార్తలను నమ్మి రైతులు ఇబ్బందులు పడొద్దని మంత్రి పేర్కొన్నారు.