బీబీనగర్(భూదాన్పోచంపల్లి), మే 13 : చేనేత వస్ర్తాలను ప్రోత్సహించాలని ఐపీఓఎస్ పోస్ట్మాస్టర్ జనరల్ పి.విద్యాసాగర్రెడ్డి, పోస్టల్ నల్లగొండ సూపరింటెండెంట్ వెంకటసాయి అన్నారు. పోచంపల్లి ఇక్కత్ వస్ర్తాలు, పుట్టపాక తేలియా రుమాల్పై తపాలాశాఖ రూపొందించిన పోస్టల్ కవర్ను శుక్రవారం భూదాన్పోచంపల్లి చేనేత టై ఆండ్ డై సిల్క్ చీరెల ఉత్పత్తిదారుల భవనంలో వారు ఆవిష్కరించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఇక్కత్ వస్ర్తాలు, తేలియా రుమాల్ ప్రత్యేక పోస్టల్ కవర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి చేనేత కార్మికుడు ఇక్కత్, తేలియా రుమాల్ పోస్టల్ కవర్ను ఉపయోగించాలని కోరారు. దీనిని ఉపయోగించడం వల్ల వస్ర్తాలకు జాతీయస్థాయి లో గుర్తింపు పొందే అవకాశం ఉందన్నారు.
పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మీరు పంపించే వస్ర్తాలను జాగ్రత్తగా కస్టమర్కు చేరవేసే బాధ్య త తీసుకుంటామన్నారు. చేనేత కార్మికులను స్పీడ్ డెలివరీతో పాటు మరిన్ని సేవలు అందించడానికి కృషి చేస్తామన్నారు. వీవర్స్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఇక్కత్ యాప్ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇక్కత్ పోస్టల్ స్టాంప్లను కూడా ప్రారంభించాలని కోరారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత జాతీయ మాస్టర్ వీవర్ పుట్టపాక గజం గోవర్ధన్ మాట్లాడుతూ పోచంపల్లి ఇక్కత్ వస్ర్తాలకు జాతీయస్థాయిలో పోచంపల్లి జీఐ అనే గుర్తింపు వచ్చిందని, ఇతర రాష్ర్టాల నుంచి చాలా మంది ప్రజలు పోచంపల్లికి వచ్చి వస్ర్తాలను కొనుగోలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టై అండ్ డై అసోసియేషన్ అధ్యక్షుడు తడక రమేశ్, సభ్యుడు లవకుమార్, పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.