నీలగిరి, ఏప్రిల్ 9: నల్గొండ జిల్లాలో పైపుల ద్వారా సహజ వాయువు (పీఎన్జీ) సరఫరా విస్తరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో పౌర సరఫరాలు, పరిశ్రమలు పంచాయతీ రాజ్ శాఖ, విద్యుత్తు, పోలీసు శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుద్ధం కారణంగా ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడిందని, ఈ నేపథ్యంలో, ముఖ్యంగా వాణిజ్య విభాగంలో ఎల్పీజీ లభ్యతపై ప్రభావం పడుతోందని, పీఎన్జీ సరఫరాను విస్తరించడం అత్యంత అవసరమన్నారు.
కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) నెట్వర్ను వేగంగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీర్ఘకాలికంగా పీఎన్జీ వినియోగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, రాష్ట్రాలకు వాణిజ్య ఎల్పీజీ కేటాయింపును 20 శాతం నుంచి 50 శాతం వరకు పెంచే అవకాశం కల్పించారన్నారు. జిల్లాలో పనిచేస్తున్న మెగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా పీఎన్జీ నెట్ వర్ విస్తరణ పనులు నిర్వహిస్తున్నారని, ఈ పనుల వేగవంతానికి 24 గంటల పాటు పని చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.
అయితే, శబ్ద కాలుష్య నిబంధనలు , భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ అనుమతి సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటుందన్నారు. పరిశ్రమల శాఖ డైరెక్టర్ను రాష్ట్ర నోడల్ అధికారిగా నియమించామని, పౌర సరఫరాల శాఖను పీఎన్జీ, ఆయిల్ మారెటింగ్ కంపెనీల (ఓఎంసీస్) మధ్య సమన్వయం కోసం నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు పోలీసు శాఖతో సహా అన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమీక్ష సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఏఎస్పీ రమేష్, పౌరసరపాల శాఖ అధికారి వెంకటేష్ , జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ సతీష్, ప్రాజెక్టు మేనేజర్ వంశీకృష్ణ, ఆర్అండ్బీ ఈఈ శ్రీధర్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ అధికారి శేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర పాల్గొన్నారు.