మర్రిగూడ, నవంబర్ 11: అమ్మబోతే అడవి..కొనబోతే కొరివి అన్నట్లుగా ఉంది జిల్లాలోని రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఆపదలో అక్కరపడతాయని కొనుగోలు చేసిన స్థిరాస్తులను అమ్మేందుకు యజమానులు పడరాని పాట్లు పడుతున్నారు. చివరకు లక్కీ డ్రా పేరుతో ప్లాట్లను విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెయ్యి కొట్టు ప్లాటు పట్టు అంటూ బ్రోచర్లను సిద్ధం చేసి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మండల కేంద్రంలోని నాంపల్లి రోడ్డులో ఉన్న 135 గజాల ప్లాట్ను లక్కీ డ్రా తరహాలో బేరం పెట్టాడు ప్లాట్ యజమాని.
డ్రాలో 1000 మంది సభ్యులు పాల్గొంటుండగా ఒక్కో సభ్యుడు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ప్లాట్ గెలుపొందిన వ్యక్తి మినహా ప్రతీ సభ్యుడికి ఏదో ఒక బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా స్థానిక హైస్కూల్ సమీపంలో ఉన్న 40 గజాల ప్లాట్కు కూడా లక్కీ డ్రా ప్రకటించారు. ఇందులో వెయ్యి మంది సభ్యులు పాల్గొంటుండగా ఒక్కో సభ్యుడు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.