బొడ్రాయిబజార్, మే 26 : సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న 4వ తెలంగాణ రాష్ట్ర స్థాయి ఇంటర్ డిస్ట్రిక్ట్ అండర్-16 బాల, బాలికల బాస్కెట్బాల్ చాంపియన్షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 31జిల్లాల జట్లు పాల్గొనగా తొలి రోజు గెలుపొందిన జట్లతోపాటు మిగిలిన టీమ్లకు శుక్రవారం రెండో రోజు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ జిల్లాల జట్లు తమ క్రీడా పటిమను ప్రదర్శించాయి. 31జిల్లాల బాస్కెట్బాల్ క్రీడాకారులు రావడంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలో సందడి నెలకొంది. నిన్న మొన్నటి వరకు నిర్మానుష్యంగా ఉన్న బాస్కెట్బాల్ కోర్టు క్రీడా జాతరను తలపించింది. పోటీలను తిలకించేందుకు పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి హర్షధ్వానాలతో క్రీడాకారుల్లో ఉత్సాహం నింపుతున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు, పీఈటీలు, కోచ్లకు ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం ఫైనల్ పోటీలతో క్రీడలు ముగియనున్నాయి. ముగింపు కార్యక్రమానికి మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతుల ప్రదానం చేయనున్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ నార్మల్ ఐజాక్, సూర్యాపేట జిల్లా కార్యదర్శి ఫారూక్, పీఈటీలు దేవరాజు, యాదగిరి, సీనియర్ క్రీడాకారుడు మంత్రి శ్రీను పాల్గొన్నారు.
రెండో రోజు విజేతలు..
బాలికల విభాగంలో సూర్యాపేట జిల్లా జట్టుపై ములుగు, నిర్మల్పై హైదరాబాద్, రంగారెడ్డిపై మహబూబ్నగర్, హనుమకొండపై జగిత్యాల జట్లు గెలుపొందాయి. సూర్యాపేటపై వికారాబాద్, జగిత్యాలపై ఖమ్మం జట్లు గెలుపొంది ప్రీ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నాయి. బాలుర విభాగంలో మహబూబాబాద్పై రంగారెడ్డి, ఖమ్మంపై నిర్మల్, నిజామాబాద్పై ములుగు, హనుమకొండపై జగిత్యాల జట్లు విజయం సాధించాయి. సూర్యాపేటపై నిర్మల్, మహబూబాబాద్పై వికారాబాద్, మహబూబ్నగర్పై జగిత్యాల, కరీంనగర్పై కామారెడ్డి జిల్లా జట్లు గెలిచి ప్రీ క్వార్టర్స్కు చేరుకున్నాయి.