సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారి వెంట సువిశాల స్థలంలో నిర్మాణం పూర్తి చేసుకుని తుదిమెరుగులు దిద్దుకుంటున్న ఈ భవనం చివ్వెంల మండలానికే ఐకాన్లా నిలుస్తున్నది. కార్పొరేట్ బిల్డింగ్ను తలపిస్తున్న ఈ భవనం నిరుపేద గిరిజన విద్యార్థినులకు బోధన అందించనున్న గురుకులం అవడం విశేషం. జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో ఐలాపురం వద్ద మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో 4 కోట్ల 20 లక్షల రూపాయలతో రూపుదిద్దుకుంటున్నది. సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన 613మంది గిరిజన విద్యార్థ్థినులకు ఇక్కడ వసతితో కూడిన విద్య అందనున్నది. ఉమ్మడి రాష్ట్రంలో పూరిగుడిసెల్లో సంక్షేమ వసతి గృహాలను చూసినవాళ్లు ఇప్పుడీ భవనాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సూర్యాపేట, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట-ఖమ్మం నూతన జాతీయ రహదారి పక్కన ఐలాపురం వద్ద విశాలమైన స్థలంలో నిర్మాణమై ఆకర్షణీయంగా కనిపిస్తున్న మూడంతస్తుల భారీ భవంతి చివ్వెంల మండలానికే ఓ ఐకాన్లా కనిపిస్తుంది. అదేదో కార్పొరేట్ కంపెనీలకు చెందిన భవనమో.. వందలాది బ్రాంచీలు కలిగిన విద్యాసంస్థో అనుకుంటే పొరపాటే. కార్పొరేట్ను తలదన్నేలా నిర్మాణం పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటున్న ఆ భవనం సర్కారు గిరిజన గురుకుల పాఠశాల. మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో రూ.4.20 కోట్లు వెచ్చించి సకల సౌకర్యాలు, అత్యాధునిక హంగులతో నిర్మించిన ఈ భవనం త్వరలో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రంగురంగుల ఆ భవనాన్ని చూసి విద్యార్థినులు పట్టలేని సంతోషంతో ఉన్నారు.
పురాతన భవనాలు.. ఊడిపోతున్న పైకప్పు పెచ్చులు.. విరిగిన బెంచీలు.. కనిపించని ప్రహరీలు.. మరుగుదొడ్లు లేక ఆడపిల్లల కష్టాలు.. ఇవన్నీ సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో సర్వసాధారణంగా కనిపించేవి. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత సర్కారు బడుల్లో పరిస్థితులు మారిపోయాయి. వసతులు మెరుగుపడ్డాయి. మండలానికో అత్యాధునిక భవనాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలలు, కళాశాలలతో పాటు ఉద్యోగార్థుల కోసం అవసరమున్న చోట కోచింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసింది. విద్యార్థులకు సన్న బియ్యం, వెజ్, నాన్వెజ్తో పౌష్టికాహారం అందిస్తున్నది. ఇప్పుడు పాఠశాల భవనాలను కార్పొరేట్ కార్యాలయాన్ని తలదన్నేలా అధునాతనంగా నిర్మిస్తున్నది. సకల సౌకర్యాలు కల్పిస్తున్నది.
చివ్వెంల మండలంలోని సూర్యాపేట-ఖమ్మం కొత్త జాతీయ రహదారి పక్కన విశాలమైన స్థలంలో నిర్మాణమై తుది మెరుగులు దిద్దుకుంటున్న గిరిజన గురుకుల పాఠశాల భవనం మండలానికే ఐకాన్గా నిలువనున్నది. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రత్యేక చొరవతో నిర్మాణమైన ఈ రంగురంగుల సర్కారు బడి చూపరులను ఆకర్షిస్తున్నది. 3.5 ఎకరాల్లో రూ.4.20 కోట్ల వ్యయంతో మూడంతస్తుల బిల్డింగ్ నిర్మించారు. ఒక్కో ఫ్లోర్కు 7200 చదరపు అడుగుల చొప్పున మొత్తం 28,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో 28 తరగతి గదులు నిర్మించారు. 640 మంది విద్యార్థినులు సౌకర్యవంతంగా చదువుకునేలా ఏర్పాట్లు చేశారు. తరగతి గదులతోపాటు సువిశాలమైన క్రీడా స్థలం, సైన్స్ ల్యాబ్, 60 వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకు, తాగునీటి వసతి, డైనింగ్ హాల్, అధునాతన మరుగుదొడ్లు నిర్మించారు. భవన నిర్మాణం దాదాపు పూర్తి కాగా.. ప్రారంభోత్సవానికి తుదిమెరుగులు దిద్దుకుంటున్నది. సకల సౌకర్యాలతో నిర్మించిన తమ బడిని చూసి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతమున్న అద్దె భవనంలో మాకు కొంత ఇబ్బందికరంగా ఉంది. చదువు మంచిగున్నప్పటికీ వాతావరణ పరిస్థితులు మా చదువులకు ఆటంకంగా ఉన్నాయి. మా కోసం నిర్మించిన కొత్త భవనం బాగుంది. ఆ భవనంలోకి వెళ్లడానికి ఎదురు చూస్తున్నాం.
– డి.శిరీష, ఇంటర్ సెకండియర్ విద్యార్థిని
ఇప్పుడు ఆడుకోవడాకి సరైన స్థలం లేక ఆటలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. కొత్త భవనంలో అనుకున్న ఆటలో ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సౌకర్యవంతమైన భవనం కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్నాం. కొత్త భవనం సిద్ధం కావడం చాలా ఆనందంగా ఉంది.
– డి.సృజన, పదో తరగతి విద్యార్థిని
పాఠశాల నూతన భవనం త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలిసింది. కొత్త బిల్డింగ్ను ఇటీవల ఓసారి సందర్శించాం. 90 శాతం పైగా పనులు పూర్తయ్యాయి. ఐలాపురం వద్ద నిర్మాణమైన భవనం చాలా విశాలంగా ఉంది. ఈ భవన నిర్మాణం విద్యార్థినుల సంఖ్య పెరిగేందుకు తోడ్పడుతుంది. అద్దె భవనం కష్టాలు తీరనున్నాయి. చాలా సంతోషకరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు
– కె.అరుణ, చివ్వెంల గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్