కోరిన కోర్కెలు తీర్చే మహిమ గల తల్లిగా ప్రసిద్ధి గాంచిన నెమ్మికల్ దండు మైసమ్మ ఆలయానికి స్వరాష్ట్రంలో మహర్దశ పట్టింది. రోజురోజుకూ భక్తుల తాకిడి విపరీతంగా పెరుగుతుండడంతో గుడి వద్ద అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కృషితో రూ.4.65 కోట్లతో రహదారి విస్తరణ, ఇతర ఆధునీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా భక్తుల ఆదరణ పొందుతున్న నెమ్మికల్ దండుమైసమ్మ ఆలయానికి మహర్దశ పట్టింది. అమ్మవారికి భక్తుల తాకిడి పెరుగుతుండడంతో అసౌకర్యం కలుగకుండా సకల వసతులు సమకూర్చుతున్నాయి. మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సహకారంతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. మూడేండ్ల క్రితం మంత్రి కోటి రూపాయలు మంజూరు చేయించగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం రూ.4.65 కోట్లతో ఆలయం వద్ద 700 మీటర్ల పొడవున నాలుగు లేన్ల రహదారి, ఆధునీకరణ చేపడుతుండగా.. పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో సూర్యాపేట జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుండగా.. గ్రామ దేవతలు మొదలుకొని అన్ని వర్గాల ఆలయాలకు పునర్వైభవం వచ్చింది. పురాతన ఆలయాలు, మసీదులు, చర్చిలను ఆధునీకరిస్తుండగా.. ఉమ్మడి రాష్ట్రంలో భక్తుల ఆదరణ ఉన్నా గుర్తింపునకు నోచుకోని గుళ్లు, జాతరలకు అత్యంత ఆదరణ లభిస్తుంది. తెలంగాణలో రెండో అతి పెద్దదిగా పేరుగాంచిన దురాజ్పల్లి లింగమంతులస్వామి జాతరకు సుమారు రూ.12 కోట్లకు పైగా తెచ్చి కనీవిని ఎరుగని రీతిలో శాశ్వత పనులు చేపట్టారు. 400 ఏండ్ల క్రితం నిర్మించినదిగా చెప్పుకొంటున్న పెద్ద మసీదు పునర్నిర్మాణ పనులు కోట్ల రూపాయలతో జరుగుతున్నాయి.
అలాగే పలు చర్చిలకు నిధులు కేటాయించారు. ఇలా అన్ని దేవాలయాలకు ఆదరణ లభిస్తుండగా ఆత్మకూర్.ఎస్ మండలంలోని సూర్యాపేట-ఖమ్మం రహదారి పక్కన నెమ్మికల్ దండుమైసమ్మ అమ్మవారి ఆలయానికి సైతం మహర్దశ వచ్చింది. సుమారు 50ఏండ్ల క్రితం నెమ్మికల్లో కొలువైన దండుమైసమ్మ జిల్లాలోనే మహిమగల తల్లిగా ప్రసిద్ధిగాంచింది. అమ్మవారిని దర్శించుకున్న వారి కోరికలు తీరుతున్నాయనే నమ్మకం పెరుగడంతో 30 సంవత్సరాల క్రితం భక్తులు చిన్నపాటి గుడిని నిర్మించారు. అక్కడికి మొదట్లో ఆది, గురువారాల్లో మాత్రమే భక్తులు వచ్చేవారు.
ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి భక్తులు నిత్యం భారీ సంఖ్యలో వస్తున్నారు. ఈ క్రమంలో చిన్న దేవాలయంతో భక్తులకు ఇబ్బంది కలుగుతుండటంతో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కృషితో దేవాలయ విస్తరణ చేపట్టారు. 2020లో రూ.50 లక్షల అంచనా వ్యయంతో సీడీఎఫ్ నిధులు కేటాయించారు. ఆ తర్వాత భక్తుల రద్దీ దృష్ట్యా అంచనా వ్యయం పెంచి కోటి రూపాయలతో ఆలయ నిర్మాణం పూర్తిచేశారు.
దేవాలయం చిన్నగా, రోడ్డుకు సమీపంలో ఉండటంతో భక్తులకు అసౌకర్యంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని దేవాలయాల అభివృద్ధి చేస్తున్న క్రమంలో దండుమైసమ్మ ఆలయ అభివృద్ధికి, విస్తరణకు మంత్రి జగదీశ్రెడ్డి నిధులు కేటాయించారు. దాంతో దేవాలయాన్ని పెద్దగా పునర్నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం వసతులకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అవి పూర్తయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సౌకర్యవంతంగా ఉంటుంది. గుడి అభివృద్ధి చేసిన మంత్రి జగదీశ్రెడ్డికి కృతజ్ఞతలు.
– బెల్లంకొండ యాదగిరి, దండుమైసమ్మ ఆలయ మాజీ చైర్మన్
దండుమైసమ్మ కోరిన కోర్కెలు తీర్చే మహిమ గల తల్లి. నేను ఐదేండ్ల క్రితం మొదటిసారి ఇక్కడికి వచ్చా. నాకు జాబ్ రావాలని అమ్మవారికి మొక్కుకున్నా. సంవత్సరంలోపే ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం గుడికి వస్తున్నా. ఇప్పుడు గుడి పెద్దదిగా అయ్యింది. అన్ని వసతులు, సౌకర్యాలు సమకూరాయి. మంత్రి జగదీశ్రెడ్డికి, ఆలయ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు.
– బొల్లికొండ రోజా, ఖమ్మం జిల్లా
దండుమైసమ్మ అమ్మవారి దేవాలయ నిర్మాణం పూర్తి కావడంతో భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో భక్తుల సౌకర్యం కోసం గుడికి రెండు వైపులా కలిపి 700 మీటర్ల మేర రహదారిని నాలుగు వరుసలుగా మార్చేందుకు మంత్రి జగదీశ్రెడ్డి రూ.4.65 కోట్లు మంజూరు చేయించారు. ఆ నిధులతో ప్రస్తుతం రహదారి విస్తరణ, డివైడర్లు, భక్తులు నడిచేందుకు సర్వీసు రోడ్ల నిర్మాణాలతో పాటు రహదారి మధ్య గ్రీనరీ, కాల్వపై కల్వర్టు పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతుండగా.. భక్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.