కల్లు గీత కార్మికుల జీవన స్థితిగతులు మార్చేలా భువనగిరి మండలం నందనంలో ఏర్పాటు చేస్తున్న నీరా ప్లాంట్ సిద్ధమవుతున్నది. ప్రకృతి సిద్ధమైన పానీయాన్ని నిల్వ చేసేందుకు తీసుకొస్తున్న కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. నాలుగు ఎకరాల్లో రూ.8 కోట్లతో చేపట్టిన నీరా కేంద్రం భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి.బిల్డింగ్లో నీరాకు సంబంధించిన ఆధునిక యంత్రాలను అమరుస్తున్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా మన దగ్గరే ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో నీరా ప్రాసెస్తోపాటు స్టోరేజీ, ప్యాకింగ్ చేయనున్నారు. ఇక్కడి నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు నీరాను సరఫరా చేయనున్నారు. అంతేకాకుండా ఇక్కడే 18 రకాల తాటి ఉత్పత్తులను తయారు చేయనున్నారు.
తాటి, ఈత చెట్ల నుంచి సూర్యోదయానికి ముందే సేకరించే పానీయం నీరా. ఆరోగ్యానికి మేలు చేసే నీరా ఉత్పత్తి ద్వారా గీత వృత్తిదారులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అంతేకాకుండా ప్రజలకు నీరా అందుబాటులోకి తేవాలని అనుకుంటున్నది. ఇప్పటికే హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో నీరా కేఫ్ను తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే తాటి వనాలు అధికంగా ఉన్న భువనగిరి మండలంలోని నందనంలో నీరా ప్లాంట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నాలుగు ఎకరాల్లో భవనం నిర్మించేందుకు రూ.8 కోట్లను విడుదల చేసింది. గతేడాది జూలై 29న రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్గౌడ్, గుంటకండ్ల జగదీశ్రెడ్డి నీరా కేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు నీరా కేంద్రం బిల్డింగ్ను త్వరితగతిన పూర్తి చేశారు.
కొనసాగుతున్న ఆధునిక యంత్రాల అమరిక
ఉదయం ఆరు గంటల్లోపు సూర్య కిరణాలు పడని కల్లును సేకరించి, ఈ ప్లాంట్కు తీసుకురానున్నారు. ఇది నీరా నుంచి కల్లుగా మారకుండా ఇక్కడే ప్రాసెస్ చేయనున్నారు. ప్రతి రోజూ రెండు వేల లీటర్ల నీరా ఈ కేంద్రానికి రానుంది. దీన్ని ఇక్కడే నిల్వ చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేక టెక్నాలజీతోపాటు అత్యాధునిక యంత్రాలను తీసుకొచ్చారు. ఇది పులియకుండా, పాడవకుండా పాశ్చరైజేషన్ చేస్తారు. పాలను పాశ్చరైజేషన్ చేసిన విధంగానే నీరాను కూడా ప్యాక్ చేస్తారు. ఇక్కడి నుంచే ప్యాక్డ్ నీరాను హైదరాబాద్ కేఫ్తోపాటు ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తారు. ప్రస్తుతం ఆధునిక యంత్రాల అమరిక పనులు నడుస్తున్నాయి. స్టోరేజ్, ప్యాకింగ్ యంత్రాలను ఇప్పటికే తీసుకొచ్చి ఉంచారు.
అనుబంధ ఉత్పత్తుల తయారీ
నందనం ప్లాంట్లో నీరాతోపాటు అనుబంధ ఉత్పత్తులను కూడా తయారు చేయనున్నారు. నీరాను ఆవిరి పట్టించడం ద్వారా ఇతర ఉత్పత్తులు తయారు చేస్తారు. ఒక్కో ఉష్ణోగ్రత వద్ద ఒక్కో ఉత్పత్తి వస్తుందని అధికారులు చెబుతున్నారు. తాటి బెల్లం, చక్కెర, చాక్లెట్లు, తేనే వంటి 18 రకాల వస్తువులను తయారు చేసే అవకాశం ఉన్నది. ప్రకృతి సిద్ధంగా వచ్చిన నీరాతో తయారు చేసిన వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. నీరాలో ఎన్నో రకాల ప్రొటీన్లు, పిండి పదార్థాలు, ఐరన్లు, లవణాలు, జింక్, సోడియం, పొటాషియం తదితర విటమన్లు, పోషకాలు కలిగి ఉంటాయి. షుగర్ ఉన్నోళ్లు సైతం దీన్ని సేవించవచ్చు. కిడ్నీ రోగులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
స్వరాష్ట్రంలోనే సాధ్యం
ఇదే నందనంలో ఉమ్మడి రాష్ట్రంలో తాటి ఉత్పత్తుల శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని భావించిన అప్పటి పాలకులు.. ఆదిలోనే వదిలేశారు. 1993లో గీత పారిశ్రామిక సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ.70లక్షలతో అప్పటి మంత్రులు గాదె వెంకట్రెడ్డి, కుందూరు జానారెడ్డి ప్రారంభించారు. అనుబంధ ఉత్పత్తులు తయారు చేయాలని భావించారు. కానీ.. నాటి ఉమ్మడి పాలకులు నిధులు కేటాయించకపోవడంతో కేంద్రం ఆదిలోనే మూతబడింది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. నిధులు కేటాయించి ప్లాంట్ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకున్నది.