నేరేడుచర్ల, డిసెంబర్ 14 : రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రీ కుమారుడు మృతిచెందగా కుమార్తె మృత్యువుతో పోరాడుతున్నది. ఆపరేషన్ నిమిత్తం రూ.10లక్షలు అవసరం కాగా ఏం చేయాలో తెలియని తల్లి దాతలు ముందుకొచ్చి తన బిడ్డను కాపాడాలని కన్నీటితో వేడుకుంటున్నది. నేరేడుచర్ల మున్సిపాలిటీ రామాపురం గ్రామానికి చెందిన పిల్లలమర్రి సత్యనారాయణ, కల్యాణి దంపతులకు కావేరి, జస్వంత్ ఇద్దరు సంతానం. వారు కూలీ చేసుకుంటూ ఉన్న దాంట్లోనే సంతోషంగా జీవిస్తున్నారు. కావేరి, జస్వంత్ను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. ఈ నెల 4న మండలంలోని చిల్లేపల్లి గ్రామంలో నివాసముంటున్న అన్న ఇంటికి సత్యనారాయణ పిల్లలిద్దరితో కలిసి బైక్పై బయలుదేరాడు. మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న లారీ వీరి వాహనాన్ని వేగంగా ఢీకొనడంతో సత్యనారాయణ, జస్వంత్ అక్కడికక్కడే మృతిచెందగా కావేరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాలికను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రిలో చేర్పించారు. కావేరి వెన్నుపూస, పక్కటెముకలకు తీవ్ర గాయాలై విషమ పరిస్థితిలో ఉంది. కావేరి ఆపరేషన్కు రూ.10లక్షలు అవుతుందని వైద్యులు తెలుపడంతో తల్లి అప్పు చేసి రూ.3లక్షలు చెల్లించింది. మరో రూ.7లక్షలు చెల్లిస్తేనే చిన్నారికి ఆపరేషన్ చేస్తామని వైద్యులు తెలుపడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. తన కూతురు ప్రాణాలు కాపాడేందుకు దాతలెవరైనా ముందుకొచ్చి సాయమందించాలని వేడుకుంటున్నది. సాయం చేయాలనుకునే వారు 9949 639713 నంబర్కు ఫోన్ పే లేదా గూగుల్ పే చేయాలని చిన్నారి బాబాయి హరిబాబు వేడుకుంటున్నాడు. కావేరి 10రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది.