ధూంధాం పాటలు బతుకమ్మ ఆటలు బోనాల సందడి ఆత్మీయ పలుకరింపులు.ఆలింగనాలు తెలంగాణ వంటకాలతో టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం పండుగను తలపించింది. కుటుంబాలు సహా వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో సంబురంగా సాగింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రధాని మోదీలో వణుకు పుట్టిస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వంపై కమలనాథులు కక్ష గట్టి మరీ దాడులకు పూనుకుంటున్నారని దుయ్యబట్టారు. మునుగోడు నియోజకవర్గం చండూరు మండలంలోని బంగారిగడ్డ గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రైతు బంధు, రైతు బీమా పథకాలు బీజేపీ పాలకులను బెంబేలెత్తిస్తున్నాయన్నారు. వ్యవసాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ ప్రధాని మోదీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నదని తెలిపారు. మన పథకాలతో బీజేపీ పాలిత రాష్ర్టాల్లో తిరుగుబాటు మొదలైందని, అందుకే కక్ష గట్టిన కమలనాథులు తెలంగాణపై దాడులకు పూనుకుంటున్నారని విమర్శించారు. వారి దాడులను గులాబీ శ్రేణులు సమర్థవంతంగా తిప్పికొట్టాలని మంత్రి జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు.
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : మన పథకాలతో పీఎం మోదీకి వణుకు మొదలైందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని, ఇందుకోసం ప్రధాని మోదీని ఎక్కడిక్కడ నిలదీస్తున్నారన్నారు. దీంతో సీఎం కేసీఆర్ సర్కారును పడగొట్టాలని మోదీ కుట్రలు, దాడులు చేస్తున్నారని విమర్శించారు. దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్పై ఉందని, అందరూ ఆయనకు అండగా నిలవాలని కోరారు. నల్లగొండ జిల్లా చండూరు మండలంలోని బంగారిగడ్డ వద్ద బుధవారం నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ కుబుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళం, వన భోజన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు టీఆర్ఎస్ పార్టీ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం, వన భోజనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
దేశంలో మొనగాండ్లు అని, వందలేండ్ల ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పే పార్టీలు సైతం ఎన్నికల మేనిఫెస్టోను సక్రమంగా అమలు చేయలేదన్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇవ్వని హామీలను సైతం అమలు చేసి ప్రజల మనుసు గెలుచుకుందని, ఈ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. రాష్ర్టానికి తండ్రిలా అన్నీ తానై ముందుకు సాగుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనేక సంక్షేమ పథకాలు ప్రజల కష్టాలను దూరం చేశాయన్నారు. కల్యాణలక్ష్మి పథకం సమాజంలో గొప్ప మార్పు తెచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ మానవత్వంతో, గొప్ప మనుసుతో పాలన అందిస్తున్నారని ఇలాంటి వ్యక్తి సీఎంగా ఉండటం మనందరి అదృష్టమన్నారు. ఇచ్చిన మాటకు వెనక్కి పోని గొప్ప నేత అని ప్రశంసించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని తెలిపారు.
బతుకమ్మ ఆడుతున్న చిన్నాపెద్ద
రాష్ట్రంలో తప్పిన తాగునీటి గోస
తెలంగాణ రాక ముందుకు తాగునీటికి గోస పడ్డామని, ఇప్పుడు మిషన్ భగీరథతో తండాట్ల తీరిందన్నారు. మునుగోడులో ఫ్లోరైడ్ భూతాన్ని కేసీఆర్ అంతం చేశారని, ఇదే విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం ప్రకటించిందన్నారు. దేశానికే తెలంగాణ అన్నపూర్ణగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, నోముల భగత్, విద్యా సదుపాయాల సంస్థ చైర్మన్ శ్రీధర్రెడ్డి, గిరిజన అభివృద్ధి సంస్థ చైర్మన్ రాంచందర్నాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, పట్టణాధ్యక్షుడు బూతరాజు దశరథ, మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళావెంకన్న, కౌన్సిలర్లు కోడి వెంకన్న, అన్నెపర్తి శేఖర్, కొన్రెడ్డి యాదయ్య, సర్పంచులు పల్లె వెంకటయ్య, నల్ల లింగయ్య, ఎంపీటీసీలు గొరిగె సత్తయ్య, కావలి మంగమ్మాప్రసాద్, నాయకులు పెద్దగోని వెంకన్న, ఉజ్జిని అనిల్రావ్, దశరథ, వెంకన్న, రవి, సైదులు పాల్గొన్నారు.
మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో పలువురి చేరిక
చండూరు, సెప్టెంబర్ 21 : మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. చండూరు మండలంలోని బంగారిగడ్డకు చెందిన పలువురు మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో బుధవారం టీఆర్ఎస్లో చేరారు. వీరికి ఆయన గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మొగుదాల యాదయ్య, ఇరిగి భగత్, వెంకన్న, బకరం చంటి, ఆర్.వంశీ, ఇరిగి ఉదయ్, తలారి ప్రభు, ఇరిగి ప్రసాద్తో పాటు మరో 20మంది ఉన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పల్ల వెంకటయ్య, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు పెదగోని వెంకన్న, నాయకులు సుంకరి సత్తయ్య, బోయపల్లి వెంకటేశం, రమేశ్, రాజు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ కుటుంబ సభ్యులంతా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు సూచించారు. ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు. గులాబీ శ్రేణులన్నీ ఏకమై ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టి. కేసీఆర్కు అండగా నిలవాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. ఇతర రాష్ర్టాల ప్రజలు సైతం తెలంగాణ మోడల్ను కోరుకుంటున్నారన్నారు. ఒకరిద్దరు టీఆర్ఎస్ను వీడినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదన్నారు.
ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు
అభివృద్ధి బండి వర్సెస్ దొంగల బండి
మునుగోడు ఉప ఎన్నికలో అభివృద్ధి బండికి, దొంగల బండికి మధ్య పోరాటం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. దొంగ బండి డ్రైవర్ రాజగోపాల్రెడ్డి అభివృద్ధి చేయలేక 22వేల కోట్లకు అమ్ముడు పోయి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేగాక ప్రజాప్రతినిధులను సైతం కోట్లు వెచ్చించి సంతల్లో పశువుల్లాగా కొనుగోలు చేస్తూ నీచమైన బుద్ధిని చాటుకుంటున్నాడని విమర్శించారు. నాయకులను కొన్నా కార్యకర్తలు తమ వెంటే ఉన్నారని చెప్పారు.
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల