నల్లగొండ, జూన్ 24 ;వివాదాలు, విభేదాలు, అక్రమాల ఆరోపణల చిక్కుముడుల్లో తండ్లాడిన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఇప్పుడు ప్రగతి పథంలో నడుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం, నాబార్డు సహకారంతో అప్పుల ఊబి నుంచి తేరుకుని లాభాల బాటలో పయనిస్తున్నది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 9 శాతంగా ఉన్న నిర్ధరకల ఆస్తుల విలువ 2021-22లో 2.39కి తగ్గింది. గతేడాదికి సంబంధించి వార్షిక ఆడిట్ నివేదికను డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన బోర్డు మీటింగ్లో వెల్లడించారు. రెండేండ్ల కాలంలో రూ.1,850 కోట్ల టర్నోవర్, రూ.35 కోట్ల స్థూల ఆదాయంతో ఎన్డీసీసీబీ రాష్ట్రంలో రెండో స్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి వ్యవసాయ రుణాలతోపాటు కమర్షియల్ రుణాలు కూడా పెంచనున్నట్లు డీసీసీబీ చైర్మన్ తెలిపారు.
డీసీసీబీకి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 107 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతో పాటు 30 బ్యాంకులు ఉన్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో పాలక వర్గం వివాదాలు..అంతకు ముందు దేవరకొండ బ్యాంకు అక్రమాల నేపథ్యంలో అప్పుల ఊబిలో కూరుకు పోయి బ్యాంకు పురోగతి ప్రశ్నార్థకమైంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారం, నాబార్డు డీసీసీబీకి విరివిగా రుణాలు ఇవ్వడం, ఉద్యోగుల కృషి మూలంగా లాభాల దిశగా పయనిస్తున్నది. దీని మూలంగా రెండేండ్లలో రూ.950 కోట్ల టర్నోవర్ ఉన్న డీసీసీబీ ప్రస్తుతం రూ.1,850 కోట్లకు పెరిగింది. అలాగే గతేడాది రూ.12 కోట్ల లాభాలు ఆర్జించగా ఈ ఏడాది రూ.23 కోట్లు సాధించినట్లు ఈ ఆడిట్ నివేదిక తెలియజేస్తున్నది.
వ్యవసాయ రుణాలకే తొలి ప్రాధాన్యం
సహకార బ్యాంకు పరిధిలో ఉన్న సొసైటీలు రెండేండ్లలో వ్యవసాయ రుణాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ. 500 కోట్ల పంట రుణాలు ఇవ్వగా, రూ.250 కోట్ల దీర్ఘ కాలిక రుణాలు ఇచ్చారు. మార్టిగేజ్ రుణాలు రూ. 250 కోట్లు ఇవ్వగా బంగారు ఆభరణాలపై రూ. 50 కోట్లు ఇతర కమర్షియల్ రుణాలు మరో రూ.50 కోట్లు అందజేశారు. అయితే పంట రుణాల్లో రెగ్యులర్గా బ్యాంకు వడ్డీ చెల్లించి రెన్యువల్ చేసుకున్న రైతులకు ప్రభుత్వం రాయితీ విడుదల చేసింది. వాస్తవంగా రైతు 7 శాతం వడ్డీతో రుణం చెల్లించగా అందులో 3.5 శాతం రాయితీ ప్రకటించి 107 సహకార సొసైటీలకు రూ.4.35 కోట్లు విడుదల చేయడంతో ఆ సొమ్ము ఆయా సొసైటీలకు కేంద్ర సహకార బ్యాంకు విడుదల చేసింది.
పలు తీర్మానాలకు ఆమోదం..
ప్రస్తుతం డీసీసీబీలో అమలు అవుతున్న వాటితో పాటు ఈ ఆర్థిక సంవత్సరం సహకార బ్యాంకుల సేవలు విస్తరించాలనే ఉద్దేశంతో బోర్డు మీటింగ్లో పాలక వర్గం పలు తీర్మానాలకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే నల్లగొండ, సూర్యాపేటకు మొబైల్ ఏటీఎం వాహనాలు ఉండగా యాదాద్రి భువనగిరి జిల్లాలకు మరొకటి ఇవ్వాలని నాబార్డుకు ప్రతిపాదనలు పెట్టారు. బహుళా సేవా కేంద్రాల పథకం కింద సొసైటీలకు ఇచ్చే రూ. కోటిలో రూ.15 లక్షలు ఫర్నిచర్, స్ట్రాంగ్ రూం నిర్మాణం చేసి రూ.85 లక్షలు రుణాలు ఇవ్వాలి. ఉద్యోగుల హౌసింగ్ రుణానికి సంబంధించి రూ.30 నుంచి రూ.75 లక్షలకు రుణ వితరణ పెంచారు. ఈ ఏడాది వ్యవసాయ రుణాలతో పాటు కమర్షియల్ రుణాలపై దృష్టి సారించి ఎక్కువ మందికి రుణాలు అందజేసి అంతే స్థాయిలో రికవరీ సాధించి లాభాలు సాధించే విధంగా పాలక వర్గం తీర్మానం చేసింది.