రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న దళిత బంధు సాయాన్ని లబ్ధిదారులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని వాసాలమర్రిలో ఏర్పాటు చేసిన యూనిట్లను రాష్ర్టానికే ఆదర్శంగా నిలుపాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో దళితబంధును ప్రారంభించి ఏడాదైన సందర్భంగా శుక్రవారం బుద్ధవనం ఓఎస్డీ మల్లేపల్లి లక్ష్మయ్యతో కలిసి యూనిట్లను సందర్శించారు. లబ్ధిదారులతో కలిసి కేక్ కట్ చేశారు.
క్షేత్రస్థాయిలో యూనిట్లను పరిశీలిస్తూ.. నిర్వహణ, ఆదాయం, దళితబంధు ద్వారా ఆయా కుటుంబాల్లో వచ్చిన మార్పులను తెలుసుకున్నారు. గతంలో రోజుకూలికి వెళ్లేదని, చాలాసార్లు పని దొరక్క ఇల్లు గడవడమే కష్టమయ్యేదని, ఇప్పుడు దళిత బంధు సాయంతో సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి అన్ని ఖర్చులు పోనూ నెలకు రూ.30వేల నుంచి 60వేల వరకూ సంపాందిస్తున్నామని పలువురు లబ్ధిదారులు సంతోషంగా చెప్పారు. తమ జీవితాలను మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
తుర్కపల్లి, ఆగస్టు 5 : దళితబంధు నిధులు సద్వినియోగం చేసుకుని లబ్ధిదారులు ఆర్థికంగా ఎదుగాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రిలో దళితబంధు పథకం ప్రారంభించి ఏడాదైన సందర్భంగా బుద్ధవనం ఓఎస్డీ మన్నెపల్లి లక్ష్మయ్య, లబ్ధిదారులతో కలిసి శుక్రవారం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అంతకు ముందు గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం యూనిట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం దళిత వాడలో లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఆదాయ, వ్యయాల గురించి అడిగి తెలుసుకున్నారు.
దళితబంధు పథకం రాకముందు దళిత కుటుంబాల ఆర్థిక పరిస్థితులు, ప్రస్తుతం ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. తాము ఇతరుల వద్ద కూలీలుగా పని చేసి చాలీచాలని డబ్బులతో ఇబ్బంది పడ్డాని, దళితబంధు వచ్చాక తమ ఆర్థిక పరిస్థితి మెరుగైందని లబ్ధిదారులు తమ మనోగతాలు వెల్లడించారు. అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుని పైలెట్ ప్రాజెక్టు కింద దళితబంధు పథకాన్ని 2021 ఆగస్టు 5న ఇక్కడి నుంచే ప్రారంభించారన్నారు. గ్రామంలో 76దళిత కుటుంబాలకు వారు ఎంచుకున్న యూనిట్లను అందించామన్నారు.
అత్యంత పేదరికంలో ఉన్న దళిత జాతి ఆర్థికంగా బలోపేతం చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకం తెచ్చారన్నారు. స్వతహాగా కష్టపడి పనిచేసే శక్తి ఉన్న దళిత కుటుంబాలు దళితబంధు నిధులను వందశాతం సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. రాష్ట్రంలోని దళితులందరికీ ఈ పథకం సక్రమంగా కావాలంటే వాసాలమర్రిలోని 76దళిత కుటుంబాలు నిబద్ధతతో నిధులను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలపడి రాష్ట్రంలోని ఇతర దళిత కుటుంబాలకు ఆదర్శం కావాలన్నారు.
అణగారిన దళిత జాతిలో ఆర్థిక మార్పు తీసుకొచ్చేందుకే సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని బుద్ధవనం ఓఎస్డీ మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో సైతం దళితుల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు.
సీఎం కేసీఆర్ మన రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, ఎంపీపీ బూక్యా సుశీలారవీందర్, పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నర్సింహారెడ్డి, సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవీన్కుమార్, ఎంపీడీఓ నరేందర్రెడ్డి పాల్గొన్నారు.