రేషన్ దుకాణాల్లో అక్రమాలకు స్వస్తి పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదేండ్ల క్రితం మ్యానువల్ వ్యవస్థను తీసేసి ఈ పాస్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దాని కోసం 2జీ ఇంటర్నెట్ సేవలను వినియోగిస్తున్నది. 2జీ సేవల ద్వారా మారుమూల ప్రాంతాల్లో ఈ పాస్ విధానానికి అంతరాయం కలుగు తుండటంతో ప్రభుత్వం
దానికి పుల్స్టాప్ పెట్టి జూలై ఒకటి నుంచి 4జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నది. గతంలో వయాసిస్ కంపెనీ వేసిన టెండర్ ఈ జూన్ 30వ తేదీతో పూర్తి కావడంతో ఈ సారి విజన్ టెక్ సంస్థ టెండర్ దక్కించుకుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సంస్థ అన్ని రేషన్ దుకాణాల్లో 4జీ సేవలను తీసుకొస్తున్నది.
– నల్లగొండ, జూలై 30
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2,111 రేషన్ దుకాణాలకు గానూ 10,10,562 మంది కార్డుదారులు ఉన్నారు. వీటిలో 34,39,523 యూనిట్లు ఉండగా ప్రతి యూనిట్కు ఆరు కిలోల చొప్పున ఒక రూపాయకే ప్రభుత్వం బియ్యం ఇవ్వనుంది. ఎప్పటి మాదిరిగానే బయోమెట్రిక్, ఐరిష్ ద్వారా బియ్యం ఇవ్వనున్న డీలర్లు ప్రత్యేక పరిస్థితుల్లో ఎవరైనా అక్కడికి రాలేకపోతే ఓటీపీ ద్వారా కూడా సరుకులు పంపిణీ చేయనున్నారు.
2జీ ఇంటర్నెట్తో సాంకేతిక సమస్యలు రావడంతో వినియోగదారులు రేషన్ దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చేది. గంటల కొద్దీ ఎదురు చూసి వెనుదిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఇక 4జీ సేవలతో క్షణాల్లో సరుకులు తీసుకొని వెళ్లొచ్చు. కార్డుదారుకు ఎంత బియ్యం ఇచ్చారనేది రిసీప్ట్ రూపంలో అందుతుంది. 4జీ సేవల వల్ల రేషన్ దుకాణాల్లో అక్రమాలకు పూర్తిగా చెక్ పడనుంది. వెయింగ్ మిషన్లో వినియోగదారుడు తీసుకెళ్లిన బ్యాగ్ బరువు తీసేసి ఎంత తీసుకుంటారో అంత మొత్తం బియ్యానికి తూకం వేస్తారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,111 మంది రేషన్ డీలర్లకు కొత్త మిషన్లపై రెవెన్యూ డివిజన్ల వారీగా ఈ నెల 24 నుంచి 27 వరకు విజన్ టెక్ కంపెనీ ప్రతినిధులు శిక్షణ ఇచ్చారు. సదరు కంపెనీ ఉమ్మడి జిల్లాలోని 71 మండలాల్లో మండలానికి ముగ్గురు చొప్పున మొత్తం 24 మంది టెక్నీషియన్స్ను నియమించగా వారు రేషన్ దుకాణాల్లో నెట్వర్క్ను బట్టి ఈ పాస్ మిషన్ను సెట్ చేసే పనిలో నిమగ్నం అయ్యారు.
రేషన్ సరఫరాలో సాంకేతిక సమస్యలను తొలగించేందుకు ప్రభుత్వం జూలై ఒకటో తేదీ నుంచి అన్ని దుకాణాల్లో 4జీ సేవలను ప్రారంభించాలని ఆదేశించింది. ఇక నుంచి దుకాణాల ముందు పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. బియ్యం సరఫరాలో సమస్యలు వస్తే వెంటనే స్పందించడానికి తాసీల్దార్లు, డీలర్లు, పౌర సరఫరాల అధికారులతో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాం. ఎక్కడైనా మిషన్ సమస్య ఉన్నా, ఇంటర్నెట్ సౌకర్యంలో ఇబ్బంది ఉన్నా వెంటనే తీర్చే విధంగా చర్యలు చేపడుతున్నాం.
-వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి, నల్లగొండ