సూర్యాపేట, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : మునుగోడు ఉపఎన్నికల్లో భారీ మెజార్టీయే లక్ష్యంగా టీఆర్ఎస్ బహుముఖ వ్యూహం రచించి ముందుకు సాగుతున్నది. కొద్ది రోజులుగా ఎన్నికల ప్రచారానికి జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి, టీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు పదునుపెట్టారు. వినూత్నరీతిలో ప్రచారం చేస్తూ ప్రజలకు చేరువయ్యేలా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే పాత, కొత్త నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రచారంతో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు వణుకు పుడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులైన ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నారు.
అధికార పార్టీలోకి వలసలు పెరుగుతుండగా.. మరోపక్క బీజేపీలోకి వెళ్లిన కొందరు ఒక్కొక్కరుగా తిరుగుపయనం అవుతుండడంతో ఆ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా పోతున్నది. ఇప్పటివరకు నియోజకవర్గ చరిత్రలోనే ఏ పార్టీ నిర్వహించని రీతిన ఒక్కో మండలం నుంచి వేలాది మంది టీఆర్ఎస్శ్రేణులతో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. మరోపక్క మునుగోడు నియోజకవర్గంలో మొన్నటి వరకు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉండి ప్రజలను గాలికి వదిలేసినా.. టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దఎత్తున అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపడుతున్నది. దీంతో నియోజకవర్గ ప్రజలు స్వచ్ఛందంగా టీఆర్ఎస్కు మద్దతు తెలుపుతూ తీర్మానాలు చేస్తున్నారు.
ఈ సారి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అద్బుతాలను సృష్టించబోతోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. నాడు తెలంగాణ రాష్ట్ర సాధించిన సంతోషంతో ఉద్యమ కారులు 2014లో నాటి అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి ఓట్లు వేసి గెలిపించిన విషయం విదితమే. కాగా నాడు నాలుగున్నరేళ్లలో ప్రజలకు చేయాల్సినంత చేయగా.. తరువాత 2018లో వచ్చిన ఎన్నికల్లో డబ్బు, మాయమాటలతో గెలిచిన అభ్యర్థి.. ఒక్కసారి కూడా జనంలోకి వచ్చిన దాఖలాలు లేవు. దీంతో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తరచూ టీఆర్ఎస్ ఇన్చార్జి ప్రభాకర్రెడ్డితో కలిసి మునుగోడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన విషయం విదితమే. నేడు సమాజంలోని ప్రతి కుటుంబం ప్రభుత్వ పరంగా ఒకటి నుంచి ఐదు ఫలితాలను అందుకుంటుండగా ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారు. స్వలాభం కోసం రాజీనామా చేసి పార్టీ మారిన స్థానిక మాజీ ఎమ్మెల్యేతో విసిగిన జనం ఈ ఉప ఎన్నికల్లో అభివృద్ధిని కాంక్షించి టీఆర్ఎస్కే పట్టం కట్టాలనే ఆలోచనతో నియోజకవర్గవ్యాప్తంగా గులాబీ దండుకు స్వాగతాలు పలుకుతూ ఆహ్వానిస్తుండడం గమనార్హం.
అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలను అందుకుంటున్న ప్రజలు సంతోషంగా ఉన్నారు. అయితే, గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే పూర్తిగా విఫలం కావడం.. కేవలం స్వలాభం కోసం పార్టీ మారి అవసరం లేని ఎన్నికలను తీసుకురావడంతో ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి అవకాశం ఇచ్చేందుకు ఓటర్లు సిద్ధమయ్యారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో నియోజకవర్గం ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి జరుగడం.. మరోపక్క బలమైన పార్టీ నాయకత్వం ఉండడంతో టీఆర్ఎస్ భారీ మెజారిటీ సాధించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. నియోజకవర్గ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ నిర్వహించని రీతిన ఒక్కొ మండలం నుంచి దాదాపు 3వేల మంది నాయకులు, కార్యకర్తలతో నియోకవర్గంలోని ఏడు మండలాల విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించి క్యాడర్లో ఉత్సాహాన్ని నింపారు. ప్రభుత్వ ఫలాలను అందుకుంటున్న వారు సంతోషంగా ఉన్నారు..
వారిని కలిసి ఓట్లు అభ్యర్థించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు భారీగా నియోకవర్గానికి చేరుకొని ముమ్మరంగా ప్రచారం చేపడుతున్నారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న పథకాలను వివరిస్తున్నారు. నియోజకవర్గంలోని గ్రామాలు, తండాలు, ఎస్సీ కాలనీల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు.