సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం సినీ తార మృణాల్ ఠాకూర్ సందడి చేశారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా మృణాల్ అభిమానులతో సెల్ఫీలు దిగారు.
బొడ్రాయిబజార్, ఆగస్టు 21 : అభివృద్ధిలో సూర్యాపేట ఆదర్శంగా నిలిచిందని, జిల్లా కేంద్రానికి వస్తున్న కార్పొరేట్ వ్యాపార సంస్థలే అందుకు నిదర్శనమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేటలో విజయవాడ బైపాస్పై నూతనంగా ఏర్పాటు చేసిన సీఎంఆర్ షాపింగ్ మాల్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు జిల్లా కేంద్రానికి రావడంతో ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. యజమానులు పేద, సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో వ్యాపారాలు కొనసాగించాలన్నారు. సీఎంఆర్ షాపింగ్మాల్ చైర్మన్ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ.. గత 40 ఏండ్లుగా నిజాయితీగా పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో తమ వ్యాపారం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, కౌన్సిలర్ కొండపల్లి నిఖిలాదిలీప్రెడ్డి, సీఎంఆర్ డైరెక్టర్ మోహన్బాలాజీ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సీఎంఆర్ షాపింగ్మాల్ ప్రారంభోత్సవానికి సినీ నటి మృణాల్ ఠాకూర్ హాజరయ్యారు. ఆమెను చూసేందుకు అభిమానులు, పట్టణ ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వారితో మాట్లాడి సందడి చేశారు. తక్కువ ధరలకు సీఎంఆర్ అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. షాపింగ్మాల్లో కలియ తిరుగుతూ అభిమానులతో సెల్ఫీలు దిగారు.