చివ్వెంల, జనవరి 29 : గ్రామాల్లో గతంలో ఎన్నడూ జరుగని అభివృద్ధి బీఆర్ఎస్ హయాం లో జరిగిందని సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. చివ్వెంల మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల్లో శాశ్వతంగా గు ర్తుండిపోయేలా జరిగిన అభివృద్ధిలో ప్రజాప్రతినిధుల తీరు అమోఘమన్నారు.
తెలంగాణకు వరించిన అవార్డులే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. గ్రామాల్లో పచ్చదనం పెంపొందించడంలో స్థానిక ప్రజాప్రతినిధుల కృషి ఎనలేనిదని కొనియాడారు. హరితహారంతో మూడు శాతం ఉన్న అడవులు ఏడు శాతానికి పెరిగాయన్నారు. సేవచేసే వారిని ప్రజలు వదులుకోరని, ప్రజల ఆశీస్సులతో మరోసారి ప్రజాప్రతినిధులుగా సేవలు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులను జగదీశ్రెడ్డి సన్మానించారు.
ఎంపీపీ ధరావత్ కుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జడ్పీటీసీ భూక్యా సంజీవ్నాయక్, వైస్ ఎంపీపీ జూలకంటి జీవన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మారినేని సుధీర్రావు, ఎంపీడీఓ లక్ష్మి, ఎంపీఓ గోపి, ఎంఈఓ గోపాల్రావు, ఏఓ ఆశాకుమారి, డాక్టర్ భవాని, ఏఈఈలు లింగానాయక్, మౌనిక, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.