మిర్యాలగూడ, నవంబర్ 30 : బైక్ దొంగలు నలుగురిని మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం పట్టణ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్రావు వివరాలు వెల్లడించారు. దొంగిలించిన బైక్ను పట్టణంలోని హనుమాన్పేట ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో అమ్ముతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో రైడ్ చేసి నలుగురిని పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులను ఏపీలోని కృష్ణా జిల్లా వీర్లపాడు మండలం కంచికచర్ల గ్రామానికి చెందిన అల్లాడి నాగమణికంఠేశ్వర్, మేచర్ల రాహుల్, షేక్ షరీఫ్ , గురజాల వినయ్గా గుర్తించినట్లు చెప్పారు.
జల్సాలకు అలవాటు పడ్డ ఈ నలుగురు ముఠాగా ఏర్పడి బైక్ దొంగతనాలు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. విచారణలో మిర్యాలగూడ, సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల, ఏపీలోని కృష్ణా జిల్లా పరిధిలో రాత్రివేళల్లో ఇండ్ల ముందు పార్కు చేసిన నాలుగు బైక్లను, ఒక దేవాలయంలో హుండీని దొంగిలించినట్లు తెలిపారు. వీరి నుంచి రూ.2 లక్షల 5 వేల విలువైన 4 బైక్లు, ఒక సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నలుగురిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. కేసును చేదించిన టూటౌన్ సీఐ సురేశ్, ఎస్ఐలు సుధీర్కుమార్, సైదిరెడ్డి, కృష్ణయ్య, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.