ఆత్మకూర్.ఎస్, డిసెంబర్ 27: ప్రమాదవశాత్తు మంచానికే పరిమితమై ఆర్థిక కష్టాలతో వైద్యం చేయించుకోలేకపోతున్న బాధితుడికి మంత్రి జగదీశ్రెడ్డి భరోసా కల్పించారు. ఆత్మకూర్.ఎస్ మండలం పాత సూర్యాపేటకు చెందిన జానకీరాములు వార్డు సభ్యుడు, భవన నిర్మాణ కార్మికుడు. కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు కింద పడడంతో రెండు కాళ్లు విరగడంతో పాటు వెన్నుముకకు దెబ్బ తగలడంతో మంచానికే పరిమితమయ్యాడు. దాంతో ఆయన కుటుంబం రోడ్డున పడింది. ఈ విషయం విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డికి తెలియడంతో మంగళవారం జానకీ రాములు ఇంటికి వెళ్లారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వెంటనే హైదరాబాద్లోని వైద్యులతో ఫోన్లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని వివరించారు. ఆయన కొలుకునే వరకు మెరుగైన వైద్యం అందించాలని ఇందుకు అవసరమయ్యే ఖర్చుల బాధ్యత తనదేనని తెలిపారు. తమకు అండగా నిలిచిన మంత్రి జగదీశ్రెడ్డి రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని జానకీరాములు కుటుంబ సభ్యులు తెలిపారు.