హాలియా, నవంబర్ 21 : ఎకరం పొలం, పింఛన్ కోసం భార్య కుమారుడు మరొకరి సాయంతో భర్తను హత్య చేసింది. వారం రోజుల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. కేసు సంబంధించిన విషయాలను మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్రావు హాలియా పోలీస్టేషన్లో సోమవారం వెల్లడించారు. పెద్దవూర మండలం చిన్నగూడెం గ్రామానికి చెందిన దాసరి వెంకటయ్య(55) ప్రస్తుతం అనుముల మండలం పులిమామిడి గ్రామంలో అత్తగారి ఇంటి వద్ద నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్య సుగుణమ్మ, కుమారుడు కోటేశ్ ఉన్నారు. వెంకటయ్యకు చిన్నగూడెం గ్రామంలో ఎకరం పొలముంది.
దాన్ని విక్రయించమని ఎంత చెప్పినా వినలేదు. దాంతో ఆయన్ని హత్య చేస్తే ఎకరం పొలంతో పాటు వితంతు పింఛన్ వస్తుందని భావించిన తల్లీకొడుకు పథకం ప్రకారం వెంకటయ్యను హత్య చేయాలని భావించారు. కానీ వారికి ధైర్యం సరిపోకపోవడంతో పక్క గ్రామానికి చెందిన అనుముల మహేశ్ను సంప్రదించగా లక్ష రూపాయలు ఇస్తే పని చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముందుగా రూ.15వేలు అడ్వాన్స్ తీసుకున్నాడు. ఈ నెల 14న తమ పథకం అమలుకు తల్లీకొడుకు మహేశ్కు ఫోన్ చేసి కారు తీసుకుని రమ్మనగా వచ్చాడు.
మహేశ్ వెంకటయ్య, ఆయన కుమారుడు కోటేశ్ను కారులోఎక్కించుకుని పులిమామిడి నుంచి మారేపల్లి వైపు బయల్దేరారు. ఫోన్లో సుగుణమ్మ ఇస్తున్న సూచనల ప్రకారం వారు వరదకాల్వ కట్టపై కారు ఆపి మృతుడికి మద్యం తాపించారు. వెంకటయ్య మద్యం మత్తులో ఉండగా టవల్ను మెడకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. మృతుడు మద్యం సేవించి చనిపోయినట్లు చిత్రీకరించడానికి కారులో తీసుకొచ్చి అనుముల నుంచి చిన్న అనుములకు వెళ్లే దారిలో పడేసి మృతుడి ఒంటిపై గల పంచ, చంపడానికి ఉపయోగించిన టవల్ను వారి వెంట తీసుకెళ్లి సుగుణమ్మకు ఇచ్చి సాక్ష్యాలను రూపుమాపేందుకు ప్రయత్నించారు.
చిన్న అనుముల గ్రామం వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉందని వీఆర్ఏ ఈ నెల 15న హాలియా పోలీస్స్టేషన్కు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు ఆరా తీయగా మృతుడు పెద్దవూర మండలం చిన్నగూడెం గ్రామానికి చెందిన దాసరి వెంకటయ్యగా గుర్తించారు. ప్రస్తుతం ఆయన అనుముల మండలం పులిమామిడి గ్రామంలో అత్తగారి ఇంటి వద్ద నివాసం ఉంటున్నట్లు తెలియడంతో పోలీసులు వెంకటయ్య భార్య, కుమారుడికి సమాచారం ఇచ్చారు.
వెంకటయ్య మృతదేహం వద్దకొచ్చిన భార్య, కుమారుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు వారి కాల్డేటాను తీసి విచారించగా వెంకటయ్యది ఆత్మహత్య కాదని హత్య అని తెలిసింది. నిందితులు ముగ్గురు నల్లగొండ నుంచి పులిమామిడికి కారులో వస్తున్నారన్న సమాచారం మేరకు వారిని పులిమామిడి స్టేజీ వద్ద అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. సమావేశంలో హాలియా సీఐ సురేశ్కుమార్, సాగర్ సీఐ నాగరాజు, హాలియా ఎస్ఐ క్రాంతికుమార్ ఉన్నారు. కేసును త్వరగా ఛేదించిన పోలీసులను అభినందించారు.