రామగిరి, జనవరి 11 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ హైస్కూల్లో ఈ నెల 9 నుంచి 11 వరకు జరిగిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక, పర్యావరణ, ఇన్స్ఫైర్ అవార్డు 2023 ప్రదర్శనలో నల్లగొండ జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. డిండి మండలం కందుకూరు జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ప్రదర్శించిన కూలింగ్ సీలింగ్ ఫ్యాన్ ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికైంది. కనగల్ మండలం చినమాదారం జడ్పీహెచ్ఎస్ విద్యార్థి చింతల నవీన్ ప్రదర్శించిన హ్యండ్ స్టిక్, ప్రొటెస్టింగ్ ఫార్మర్స్ ఫ్రమ్ స్నేక్ బైట్ ప్రాజెక్ట్ కూడా జాతీయ స్థాయికి ఎంపికైంది.
దాంతో పాటు నల్లగొండ పట్టణం చర్లపల్లిలో గల డీవీఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గైడ్ టీచర్ బొడ్డుపల్లి రామకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులు యాస్మిన్ కౌసర్, కె. రాజేశ్వరి ప్రదర్శించిన టీఎల్ఎం రాష్ట్ర స్థాయిలో ద్వితీయ బహుమతికి ఎంపికయ్యింది. వీరికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి బహుమతులు అందించారు. బహుమతులు సాధించిన గైడ్ టీచర్లతో పాటు విద్యార్థులను జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతి, డీఈఓ భిక్షపతి అభినందించారు. బీఈడీ కళాశాల విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ దొడ్డ శాంతికుమార్, ప్రిన్సిపాల్స్ పి. గంగాధర్రావు, బి. నారాయణరెడ్డి అభినందించారు.
నడిగూడెం విద్యార్థుల ప్రతిభ
నడగూడెం : రాష్ట్ర స్థాయి సైన్స్ఫెయిర్లో మండల కేంద్రంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని రెండో స్థానం సాధించినట్లు పాఠశాల హెచ్ఎం కనకతార బుధవారం తెలిపారు. గణిత విభాగంలో నిర్వహించిన సైన్స్ఫెయిర్లో పాఠశాలకు చెందిన ధరణి బహుమతి సాధించినట్లు తెలిపారు. గణిత ప్రదర్శనకు గైడ్లుగా ఉపాధ్యాయులు శైలజ, చైతన్య వ్యవహరించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి ధరణిని ఉపాధ్యాయులు, ఎంఈఓ సలీం షరీఫ్ అభినందించారు.