తల్లిదండ్రులు లేని, పేద కుటుంబాలకు చెందిన బాలికలకు మెరుగైన విద్యనందించేందుకు ఏర్పాటైన కస్బూర్బా విద్యాలయాలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న స్కూళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీయట్ వరకు అప్గ్రేడ్ చేస్తూ వస్తున్నది. నాణ్యమైన బోధన, హాస్టల్ వసతి, ఆహ్లాదకరమైన వాతావరణం, మెరుగైన సౌకర్యాలతో కేజీబీవీలు కార్పొరేట్ స్థాయిలో కొనసాగుతున్నాయి. దాంతో అడ్మిషన్ల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కో తరగతిలో 40 సీట్లకు మాత్రమే పరిమితి ఉండగా 50 నుంచి 70 వరకు చేరారు. ఈ నేపథ్యంలో కొన్ని విద్యాలయాల్లో ‘అడ్మిషన్లు ఫుల్’ అనే బోర్డులు కనిపిస్తున్నాయి. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 27 కేజీబీవీలు ఉండగా 7,859 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఈ ఏడాది 6వ తరగతిలోనే 1,406 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. దేవరకొండ కేజీబీవీలో అన్ని తరగతులు కలిపి అత్యధికంగా 659 మంది విద్యార్థినులున్నారు.
రామగిరి, జూలై 19: విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ సౌకర్యాలు కల్పిస్తుండడంతో దాంతో ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు వెలుస్తున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు లేని పిల్లలు, తల్లిదండ్రుల్లో ఒకరు ఉండి మరొకరు లేనివారు, వలస వెళ్లిన పిల్లలు, పేద విద్యార్థినుల కోసం ప్రభుత్వం కేజీబీవీలను స్థాపించింది. పదేండ్ల క్రితం కేజీబీవీల్లో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ. రాష్ట్రం ఏర్పాటు తర్వాత కేజీబీవీల్లో విద్యా ప్రమాణాలను మెరుపరుస్తూ కొత్త భవనాలు, మౌలిక వసతులు కల్పించడంతోపాటు మెరుగైన విద్యాబోధన, రుచికరమైన పౌష్టికాహారం, డిజిటల్ తరగతుల అమలుతో విద్యార్థ్ధినులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. విద్యార్థ్ధినుల సంఖ్య రోజురోజుకు పెరిగి పోతుండడంతో ప్రజాప్రతిధులు, అధికారులు సీట్లు కావాలని రిక్వెస్ట్ చేసే పరిస్థితులు నెలకొన్నాయి.
నల్లగొండ జిల్లాలో 27 కేజీబీవీలు..
రాష్ట్రం ఏర్పాటు కంటే ముందు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 14 కేజీబీవీలుండేవి. అయితే స్వరాష్ట్రంలో ప్రభుత్వం బాలికా విద్యకు ప్రాధాన్యమివ్వడంతో ప్ర స్తుతం వాటి సంఖ్య 56కు చేరింది. కేవలం నల్లగొండ జిల్లాలోనే 27 కేజీబీవీలు ఉండగా వీటిలో 12 పాఠశాలలో ఇంటర్మీడియట్ వరకు నిర్వహిస్తున్నారు.
ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్
జిల్లా వ్యాప్తంగా 27 కేజీబీవీలుండగా వీటిలో గతంలో పదోతరగతి వరకు మాత్రమే బోధన ఉండేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం వీటిని అప్గ్రేడ్ చేస్తూ వస్తుండడంతో జిల్లా వ్యాప్తంగా 13 కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ వరకు బోధన సాగుతున్నది. అంతే కాకుండా విద్యార్థినులకు డిజిటల్ తరగతుల సైతం ప్రభుత్వం అందిస్తున్నది.
జిల్లాలో అడ్మిషన్లు ఇలా..
కేజీబీవీ అడవిదేవులపల్లిలో 221 మంది విద్యార్థినులు, నాగార్జునసాగర్లో 375, చందంపేటలో 235, చండూర్ 325, చింతపల్లిలో 230, దామరచర్లలో 410, దేవరకొండలో 659, గుండ్లపల్లి(డిండి)లో 204, గుర్రంపోడులో 210, కనగల్లో 241, కట్టంగూర్లో 319, కేతేపల్లిలో 365, కొండమల్లేపల్లిలో 155, మాడ్గులపల్లిలో 334, మర్రిగూడలో 260, మిర్యాలగూడ(వేములపల్లి)లో 313, మునుగోడులో 390, నాంపల్లిలో 232, నేరేడుగొమ్ముల్లో 214, నిడమనూర్లో 251, పీ.ఏ.పల్లిలో 269, పెద్దవూరలో 355, శాలిగౌరారంలో 214, తిప్పర్తిలో 348, తిరుమలగిరి(సాగర్)లో 215, త్రిపురారంలో 158, మిర్యాలగూడలో 357 మంది కలిపి మొత్తం 7,859( 6 నుంచి 10 తరగతి వరకు 6,432 మంది, ఇంటర్మీడియట్ లో 1,427 మంది విద్యార్థ్ధినులున్నారు.
ఇంటర్మీడియట్ ఉన్న 13 కేజీబీవీలు ఇవే…
జిల్లా వ్యాప్తంగా 13 కేజీబీవీలు ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ చేశారు. నాగార్జునసాగర్, చండూర్, దామరచర్ల, దేవరకొండ, కట్టంగూర్, కేతేపల్లి, మాడ్గులపల్లి, మర్రిగూడ, నాంపల్లి, మునుగోడు, పెద్దవూర, తిప్పర్తి, మిర్యాలగూడ కస్తూరిబా విద్యాలయాలు ఉన్నాయి.
ఈ ఏడాది పెరిగిన విద్యార్థినుల సంఖ్య ఇలా..
కేజీబీవీల్లో ఈ విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు భారీగా పెరిగాయి. వాస్తవానికి ఒక్కోక్క తరగతిలో ప్రభుత్వం 40 సీట్లు మాత్రమే కేటాయించింది. కానీ జిల్లా వ్యాప్తంగా ఉన్న 27 కేజీబీవీల్లో ప్రతి తరగతిలో 50 మంది విద్యార్థులకు మించి అడ్మిషన్లు అయ్యాయి. ఈ విద్యా సంవత్సరం 6వ తరగతిలోనే 1,406 మంది విద్యార్థ్ధినులు చేరారు. అయితే 6 నుంచి 12వ తరగతి వరకు ఆయా పాఠశాలల్లో 7,859 మంది విద్యార్థినులు ఉన్నారు. వీటిలో ఈ పర్యాయం అడ్మిషన్లకు అధికారులు, ప్రజాప్రతినిధుల సిఫార్సు సైతం కొనసాగింది.
ప్రభుత్వం కల్పిస్తున్న వసతులతో అడ్మిషన్లకు పోటీ
కేజీబీవీల్లో మెరుగైన బోధనతోపాటు రుచికరమైన పౌష్టికాహారం, శారీరక వ్యాయామంతోపాటు భరోసా కల్పించేలా ప్రభుత్వం ఉచితంగా విద్యనందిస్తుండడంతో అడ్మిషన్లకు పోటీ బాగా పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 27 కేజీబీవీల్లో 6,432 మంది విద్యార్థ్ధినులు చేరారు.
– బి.భిక్షపతి, డీఈఓ, నల్లగొండ
సీట్ల కోసం పోటీ
పీ.ఏ.పల్లి మండలంలో చాలా వరకు ఆటో సౌకర్యం లేని గ్రామాలున్నాయి. దాంతో అందరి పిల్లలకు హాస్టల్ వసతి కావాల్సిన అవసరం ఉంది. మరో వైపు ప్రభుత్వం కేజీబీవీల్లో మెరుగైన విద్య, పౌష్టికాహారం అందిస్తుంది. గతేడాది పదోతరగతి ఫలితాల్లో ఇతర పాఠశాలలతో చూస్తే ఉత్తమ ఫలితాలతో మా విద్యార్థినులు సత్తా చాటారు. దాంతో ప్రవేశాల కోసం పోటీ నెలకొన్నది. వాస్తవానికి ప్రతి తరగతిలో 40సీట్ల చొప్పున 200 సీట్లు మాత్రమే పాఠశాలలో అవకాశం ఉంది. అయితే మా పాఠశాలలో అంతకు మించి ఈ విద్యా సంవత్సరం 283 మంది విద్యార్థినులను చేర్చుకున్నాం.
-కత్తుల సరళ, ఎస్ఓ, కేజీబీవీ, పీ.ఏ.పల్లి