యాదాద్రి భువనగిరి, జూలై 6 (నమస్తే తెలంగాణ) : భూదాన్ పోచంపల్లి మండలంలోని పెద్దరావులపల్లిలో ధాన్యం కొనుగోళ్ల విషయం దుమారం రేపింది. సోమవారం నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘ధాన్యం కొను‘గోల్మాల్’ శీర్షికన వార్తా కథనం ప్రచురితమైంది. దీనిపై జిల్లా అధికారులు స్పందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా కోఆపరేటివ్ అధికారి నాగార్జున, పోచంపల్లి తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి శైలజ గ్రామంలో విచారణ చేపట్టారు.
అధికారులు గ్రామానికి చేరుకోకముందే ఉదయం నుంచే రైతులంతా పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కార్యాలయంలో సర్పంచ్తోపాటు, రైతులను విచారించారు. ఈ సమయంలోనే రైతులు.. అధికారులు, సర్పంచ్పై మండిపడ్డారు. తమ డబ్బులు సర్పంచ్ ఖాతాలో ఎలా జమ చేస్తారని నిలదీశారు. తమకు చెప్పకుండా ధాన్యం డబ్బులు సర్పంచ్ తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. తమకు సర్పంచ్ కనీసం సమాచారం ఇవ్వలేదని, తాము వడ్లు అమ్మాలని చెప్పలేదని స్పష్టం చేశారు.
అయితే ‘నమస్తే తెలంగాణ’లో వార్తా కథనం ప్రచురితం కావడంతో ఉదయం నుంచే అనేక మంది రైతులను తమ వైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. కొందరికి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు వేశారు. మరికొంతమందికి నేరుగా క్యాష్ ముట్టజెప్పారు. ఇప్పటికీ రూ. 3లక్షలకు వరకు రైతులకు ఇచ్చారని, మరో రూ. 6లక్షలు ఇస్తామని సర్పంచ్ ఒప్పుకున్నారు. ఈ విషయమై విచారణ చేపట్టామని, మరింత లోతుగా పరిశీలిస్తామని, కలెక్టర్కు నివేదిక అందజేస్తామని డీసీవో నాగార్జున తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్చార్జ్, ట్యాబ్ ఎంట్రీ ఆపరేటర్ను వచ్చే సీజన్ నుంచి విధుల్లోకి తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేశామన్నారు. రైతులకు అందాల్సిన మిగతా డబ్బును సమకూరుస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారని తెలిపారు. కాగా ధాన్యం కొనుగోళ్లలో భాగస్వాములైన ఉద్యోగులపై చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
పెద్దరావులపల్లిలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో అవకతవకలకు పాల్పడిన ఉద్యోగులు, సర్పంచ్, ఇతర సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని సోమవారం కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) భాస్కర్రావుకు రైతులు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని, రైతులకు న్యాయం చేయాలని కోరారు. ధాన్యం కొనుగోళ్ల సమయంలోనే కటింగ్ పేరుతో అవినీతికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ధాన్యం విక్రయించాక సుమారు 1444 బస్తాలకు చెందిన దాదాపు రూ.14లక్షలు రైతుల ఖాతాలో జమ కాలేదని చెప్పారు. రైతుల వడ్ల డబ్బులు సర్పంచ్ మోటె బాలకృష్ణ, వార్డు మెంబర్ తోకల శేఖర్ ఖాతాలో వేసుకున్నారని, బాధ్యులైన అందరినీ విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని, అదే విధంగా రైతులకు ధాన్యం డబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేశారు.