విద్యార్థుల్లో దాగి ఉన్న శాస్త్ర సాంకేతిక (విజ్ఞాన, గణితశాస్త్ర) నైపుణ్యాలను వెలికితీసి వారి ప్రతిభకు పదునుపెట్టే జిల్లా స్థాయి సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శనకు జిల్లా విద్యాశాఖ సన్నద్ధమైంది. సమాజం కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ప్రధాన అంశంతోపాటు ఇన్స్పైర్ మానక్ అవార్డుల (2022-23)కు ఎంపికైన ప్రాజెక్టులతో డిసెంబర్ మూడో వారంలో నిర్వహించనున్నారు. ప్రదర్శనకు సూచించిన అంశాల్లో వర్కింగ్ మోడల్స్కు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాలలోని పాఠశాలల సైన్స్, గణిత ఉపాధ్యాయులు విద్యార్థులను చైతన్యం చేసి నూతన ప్రాజెక్టులను తయారు చేయించాలని జిల్లా విద్యాశాఖ అధికారి బి.భిక్షపతి పిలుపునిచ్చారు.
జిల్లా స్థాయి ‘రాష్ట్రీయ బాలల వైజ్ఞానిక ప్రదర్శిణి’ (ఆర్ఎస్బీవీపీ) పేరుతో జవహర్లాల్ నెహ్రూ జాతీయ వైజ్ఞానిక గణిత – పర్యావరణ ప్రదర్శనను నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగా ‘సమాజం కొరకు సైన్స్ అండ్ టెక్నాలజీ’ పేరుతో విద్యార్థులు పలు ప్రాజెక్టులను తయారు చేసి ప్రదర్శనకు తీసుకొచ్చే విధంగా జిల్లాలోని సమస్త యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సిద్ధం కావాలని సూచించింది. జిల్లా స్థాయి ప్రదర్శనలో ఎంపికైన ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి పంపిస్తారు. వైజ్ఞానిక ప్రదర్శన చైర్మన్గా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వ్యవహరించనుండగా.. మెంబర్ కన్వీనర్గా డీఈఓ, సభ్యులుగా డైట్ ప్రిన్సిపాల్, జిల్లా సైన్స్ అధికారితోపాటు పలువురు కమిటీలో ఉంటారు.
జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్లో ఆయా ఉప అంశాల్లో ప్రాజెక్టుల ప్రదర్శన ఉంటుంది. వీటితోపాటు 2022-23 విద్యా సంవత్సరంలో ఇన్స్పైర్ మానక్ అవార్డు, జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి ఎంపికైన 101 ప్రాజెక్టుల ప్రదర్శన కూడా ఉంటుంది. దీంతో ఉత్తమమైన సైన్స్ వాతావరణం జిల్లాలో నిర్వహించే సైన్స్ ఫెయిర్లో దర్శనమివ్వనున్నదని చెప్పొచ్చు.
జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనేందుకు సమస్త యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో 6నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు అవకాశం ఉన్నది. విద్యార్థులను ఆయా పాఠశాలల సైన్స్, గణిత ఉపాధ్యాయులు ప్రోత్సహించాల్సి ఉంటుంది. వీరితోపాటు జిల్లాలోని డీఈడీ, బీఈడీ కళాశాలల్లో ఛాత్రోపాధ్యాయులు నూతన బోధనా సామగ్రిని ప్రదర్శించవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు సైతం నూతన బోధన ఆవిష్కరణలు ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. కాగా, ప్రదర్శనలో పాల్గొనే పాఠశాలలు, విద్యార్థులు, ఛాత్రోపాధ్యాయుల వివరాలను ఈ నెల 20న సాయంత్రం 5గంటల లోపు https://forms.gle/vq7DNUnWeFccpQqo6 లింక్లో సమర్పించాల్సి ఉంటుంది. ప్రాజెక్టుల తయారీలో ఆయా విద్యాసంస్థల గణితం, సైన్స్ ఉపాధ్యాయులు గైడ్ టీచర్లుగా విద్యార్థులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉన్నది.
విద్యతోపాటు విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక అంశాల్లోని నైపుణ్యాలను వెలికితీసి వారి ప్రతిభకు పదునుపెట్టి అభివృద్ధి చేసేందుకే సమస్త యాజమాన్యాల పాఠశాలలు, విద్యా శిక్షణ కళాశాలల్లోని విద్యార్థులకు సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తారు. సూచించిన ప్రధానాంశంలోని ఉప అంశాలపై విద్యార్థులు ప్రాజెక్టులను తీసుకొచ్చి ప్రదర్శించాల్సి ఉంటుంది. పాఠశాల దశ నుంచి సైన్స్, గణితం సబ్జెక్టుల్లో పట్టు సాధించే విధంగా విద్యార్థులను తయారు చేయడంలో ఈ ప్రదర్శనలు ఎంతో దోహదం చేస్తాయని విద్యా, సైన్స్ నిపుణులు సూచిస్తున్నారు.
జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రధానాంశం ‘సమాజం కొరకు సైన్స్ అండ్ టెక్నాలజీ). ఇందులో ఉండే ఉప అంశాలు ఇవి.
1. ఆరోగ్యం
2. జీవితం (పర్యావరణానికి జీవన శైలి)
3. వ్యవసాయం
4. సమాచారం అండ్ రవాణా
5. కంప్యూటేషనల్ థింకింగ్
ఈ విభాగాల్లో ఉత్తమంగా (ప్రథమ స్థానం సాధించిన) నిలిచిన ప్రదర్శనల్లో జూనియర్స్ నుంచి 5, సీనియర్స్ నుంచి ఐదింటిని రాష్ట్రస్థాయికి పంపిస్తారు. ముఖ్యంగా ఆయా అంశాల్లో వర్కింగ్ మోడల్స్కు ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులకు సైన్స్ ఫెయిర్ జరిగే రోజుల్లో వివిధ అంశాల్లో సెమినార్లు, వ్యాసరచన పోటీలు సైతం ఉంటాయని సంబంధిత అధికారులు తెలిపారు.
పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో శాస్త్రీయ నైపుణ్యాలను పెంచేందుకు సైన్స్, గణితం అంశాల్లో ఉత్తమ ప్రాజెక్టుల నిర్వహణకు విద్యాశాఖ నిర్వహించే సైన్స్ఫెయిర్ ఎంతో దోహదం చేస్తుంది. అన్ని పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తమ విద్యార్థులను జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలోని ఉప అంశాల వారీగా ప్రాజెక్టులను తయారు చేసేలా ప్రోత్సహించాలి. ప్రతి పాఠశాల నుంచి జూనియర్స్, సీనియర్స్ విభాగంలో ప్రాజెక్టులతో పాల్గొనేలా చూడాలి. ఇది విద్యార్థుల్లో ఆసక్తిని పెంచడానికి చక్కటి మార్గం. ఏమైనా సందేహాలు, సలహాలు ఉంటే 9848578845లో సంప్రదించాలి.
– వనం లక్ష్మీపతి, జిల్లా సైన్స్ అధికారి, నల్లగొండ
రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి వైజ్ఞానిక గణిత ప్రదర్శన ఈ నెల మూడో వారంలో నిర్వహించేందుకు సిద్ధమయ్యాం. ఆ దిశగా అందరి సహకారంతో ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో 6నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు ప్రాజెక్టులు తయారు చేసి తీసుకొచ్చే విధంగా ఆయా పాఠశాలల సైన్స్, గణిత ఉపాధ్యాయులు కృషి చేయాలి. 5 ఉప అంశాల్లో ఉత్తమమైన అధిక ప్రాజెక్టులు వచ్చేవిధంగా, వాటిలో వర్కింగ్ మోడల్స్కు ప్రాధాన్యత ఇచ్చేలా ఉపాధ్యాయులు చూడాలి. సైన్స్ ఫెయిర్ను విజయవంతం చేయడానికి అన్ని మండలాల ఎంఈఓలు, కాంప్లెక్స్ స్కూల్స్ హెచ్ఎంలు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సహకారం అందించి ప్రాజెక్టులు ఎక్కువ వచ్చేలా చూడాలి. వీటితోపాటు ఇన్స్పైర్ మానక్ – 2022-23కు ఎంపికైన 101 ప్రాజెక్టుల ప్రదర్శన సైతం జరుగుతుంది. మన జిల్లా విద్యార్థులు ఆ ప్రాజెక్టులతో రాష్ట్ర, జాతీయ స్థాయికి వెళ్లి జిల్లా ఖ్యాతిని చాటేలా చూడాలి. విద్యార్థుల శాస్త్రీయ నైపుణ్యాలకు పదును పెట్టాలనేది మా సంకల్పం.
– బి.భిక్షపతి, నల్లగొండ డీఈఓ