మిర్యాలగూడ, మార్చి 21 : మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైస్ మిల్లుల్లో ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతున్నాయని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేశ్, మిర్యాలగూడ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్ తెలిపారు. గురువారం పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో వారు విలేకరులతో మాట్లాడారు. సీజన్ ప్రారంభం నుంచి ప్రతి రోజూ 3,500 ట్రాక్టర్లకుపైగా ధాన్యం మిల్లుల వద్దకు వస్తున్నాయని, వచ్చిన ప్రతి గింజా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఇతర జిల్లాల ధాన్యంతో కలుపుకొని ప్రతి రోజూ 5వేలకు పైగా ధాన్యం ట్రాక్టర్లు వస్తున్నాయన్నారు.
పెద్దఎత్తున ధాన్యపు ట్రాక్టర్లు రావడం వల్ల మిల్లర్లకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, అయినప్పటికీ ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 1.50లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఇంకా 1.50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. ప్రతి ఏడాది 4 నుంచి 5లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని, ఈ సారి క్రాప్ లేని కారణంగా 3లక్షల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసి ఆ మేరకు కొనుగోలు చేస్తామన్నారు. ప్రతి ఏడాది సీఎంఆర్ కింద 1.70 లక్షల టన్నుల ధాన్యం తీసుకుంటున్నారని, రాబోయే సీజన్లో లక్ష టన్నుల ధాన్యం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
ఈ సీజన్లో పంటకు సరైన సాగునీరు అందకపోవడం వల్ల ఆశించిన పంట రాలేదని, వచ్చిన పంటలో కొంత నాణ్యత లోపం ఉందని చెప్పారు. ప్రధానంగా మహేంద్ర చింటూ, కావేరి చింటూ, హెచ్ఎంటీ రకం వంటి సన్నరకం ధాన్యం వస్తున్నాయని, మహేంద్ర చింటూ రకం ధాన్యం ఐఆర్64 ధాన్యానికి పోలికగా ఉన్నాయని, ఇందులో పొడవు, పొట్టి ధాన్యపు గింజలు ఉంటున్నాయని తెలిపారు. అలాంటి ధాన్యాన్ని సెలన్లో వేసి బియ్యంగా మార్చినప్పుడు, ఆ బియ్యం ఉడకబెట్టినప్పుడు ముద్దగా, తెల్ల గంజిగా అన్నం తయారవుతుందని అన్నారు. అలాంటి బియ్యం అమ్మడానికి పనికిరాని పరిస్థితి ఉందని, దాని వల్ల ధాన్యం కొనే పరిస్థితి లేదని తెలిపారు.
కావేరి చింట్లు హెచ్ఎంటీ వంటి సన్నరకం ధాన్యాన్ని రూ.2,450కు పైగా ధర ఇస్తున్నామన్నారు. నాణ్యత గల ధాన్యం దిగుబడి వచ్చే వరి పంటను సాగు చేసుకుంటే ఉపయోగం ఉంటుందని, మేలు రకమైన వరి విత్తనాలను సాగు చేయాలని సూచించారు. సన్న బియ్యం ఎగుమతి కోసం ప్రభుత్వాలు అనుమతి ఇవ్వాలని, దాని ద్వారా బియ్యంతోపాటు ధాన్యం ధర కూడా పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వానికి, అధికారులకు, రైతులకు సహకరిస్తున్నామని, చిన్నచిన్న సమస్యలుంటే వాటిని అధిగమించి ముందుకు వెళ్తున్నామని తెలిపారు. వారి వెంట మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణచౌదరి, గంటా సంతోష్రెడ్డి, కోశాధికారి చిల్లంచర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.