యాదగిరిగుట్ట, ఏప్రిల్ 16 : యాదగిరిగుట్టను స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి ఆదేశించారు. ఈ మహాయజ్ఞంలో పట్టణవాసులంతా పాల్గొంటేనే సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు. మున్సిపల్ సాధారణ నిధులు రూ.15 లక్షలతో 2 స్వచ్ఛ ఆటోలు, రూ.5 లక్షలతో 2 వాటర్ ట్యాంకర్లను కొనుగోలు చేయగా ఆదివారం పురపాలక సంఘం కార్యాలయంలో ప్రభుత్వ విప్ పచ్చ జెండాను ఊపి వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోని వృథా చెత్తను చెత్త ఆటోల్లో వేయాలన్నారు. తడి, పొడి చెత్తను వేరుచేయాలని సూచించారు. రూ.21.01 కోట్లతో పట్టణాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తామన్నారు. పట్టణంలో పట్టణ ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు సిద్ధమైనట్లు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు సాగుతున్నాయన్నారు. అవసరమైన చోట అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మిస్తామన్నారు. మంత్రి కేటీఆర్ హామీ మేరకు మరో రూ.50 కోట్లతో పట్టణాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధాహేమేందర్గౌడ్, వైస్ చైర్మన్ మేడబోయిన కాటంరాజు, కౌన్సిలర్లు సీస విజయలక్ష్మీకృష్ణగౌడ్, మాలోతు సరోజ, దండబోయిన అనిల్, కో ఆప్షన్ సభ్యులు పేరబోయిన పెంటయ్య, ఎండీ బాబా, ఎండీ రిజ్వానా, మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ చక్రపాణి, మేనేజర్ నరేశ్రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
రాజాపేట : ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే ఒక్క రాజాపేట మండలాభివృద్ధికే సుమారు రూ.100 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి తెలిపారు. మండలాభివృద్ధికి కేటాయించిన నిధులను ఆదివారం ఒక ప్రకటన ద్వారా ఆమె వివరించారు. మిషన్ కాకతీయతో మండలంలోని 66 చెరువులు, కుంటలను రూ.13.37 కోట్లతో పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. రూ.4 కోట్లతో నాలుగు చెక్డ్యామ్లు నిర్మించామని పేర్కొన్నారు. మండల కేంద్రంలో రూ.3 కోట్లతో గోదాములు, సాంఘిక, సంక్షేమ గురుకుల పాఠశాలలో అదనపు తరగతి గదుల కోసం రూ.2.47 కోట్లు, రఘునాథపురం వద్ద రూ.3.46 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. అలాగే రఘునాథపురం నుంచి సోమారం వరకు రూ.3.11 కోట్లతో బీటీ రోడ్డు, కుర్రారం రోడ్డుకు 2.20 కోట్లు, నెమిలె నుంచి పులోనిబావి మీదుగా సోమారం వరకు బీటీ రోడ్డుకు రూ.2 కోట్లు, చల్లూరు నుంచి బేగంపేట రోడ్డు రెన్యూవల్ కోసం రూ.1.2 కోట్లు, రాజాపేట నుంచి కుర్రారం వరకు రూ.52 లక్షలు కేటాయించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టినట్లు చెప్పారు. రఘునాథపురం, రాజాపేటలో రూ.36 లక్షలతో పశువైద్యశాలలు, జాల, సోమారంలో రూ.15 లక్షలతో గోపాలమిత్ర భవనాలు, రాజాపేటలో స్త్రీ శక్తి భవన నిర్మాణానికి రూ.32 లక్షలు, రాజాపేటలో ఖబ్రస్థాన్ ప్రహరీతెపాటు పారుపల్లి, నెమిలె, బొందుగుల గ్రామాల్లో రూ.12.60 లక్షలతో పీర్లకొట్టాలు నిర్మించినట్లు తెలిపారు. అదేవిధంగా రాజాపేట, బేగంపేట, బొందుగుల, చల్లూరు, దూదివెంకటాపురం జడ్పీ పాఠశాలల్లో రూ.2.40 కోట్లతో అదనపు తరగతి గదులు నిర్మించినట్లు పేర్కొన్నారు. తన సొంత నిధులు రూ.2కోట్లతో పలు గ్రామాల్లో సీసీ రోడ్లతోపాటు కుల సంఘ భవనాలు, రూ.2.15 కోట్ల ఈజీఎస్ నిధుల నుంచి సీసీ రోడ్లు నిర్మించినట్లు చెప్పారు. రాజాపేట ఆర్అండ్బీ అతిథి గృహ పునరుద్ధరణకు రూ.15 లక్షలు, దూదివెంకటాపురంలో ముదిరాజ్ భవన నిర్మాణం కోసం రూ.10 లక్షలు, బొందుగుల, జాల, పాముకుంట, రఘునాథపురం, కొన్రెడ్డిచెర్వు గ్రామాల్లో జీపీ భవనాల కోసం రూ.74 లక్షలు మంజూరు చేయగా నూతన జీపీ భవనాలు నిర్మించుకున్నట్లు తెలిపారు. రూ.60 లక్షలతో పారుపల్లి, బొందుగుల, రేణికుంట గ్రామాల్లో నూతన హెల్త్ సబ్ సెంటర్ భవనాలు సైతం నిర్మించినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ను ఒప్పించి ఎస్టీఎఫ్ నిధులతో సీసీ రోడ్లు, అంతర్గత మురికి కాల్వల కోసం గ్రామానికి రూ.25 లక్షల చొప్పున రూ. 5.75 కోట్లు మంజూరు చేసి మౌలిక వసతులు సమకూర్చినట్లు తెలిపారు. నెమిలె క్రాస్ రోడ్డు నుంచి కొలనుపాక వరకు రూ.10.30 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణంతోపాటు యాదగిరిగుట్ట నుంచి సింగారం వరకు డబుల్ రోడ్డు పునరుద్ధరకు 8.50 కోట్లు మంజూరు చేయగా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. బేగంపేట, పారుపల్లి వాగుల్లో హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణం కోసం రూ. 20 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.