చండూరు, నవంబర్ 11 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన 69వ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎస్ జి ఎఫ్ అండర్ -14, అండర్ -17 బాల బాలికల కరాటే పోటీల్లో చండూరు మండల కేంద్రంలోని గాంధీజీ విద్యాసంస్థల విద్యార్థులు ప్రతిభ చూపి గోల్డ్ మెడల్స్ సాధించారు. రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ కరాటే పోటీలకు ఎంపికయ్యారు. మంగళవారం గాంధీజీ విద్యా సంస్థలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ వెంకన్న గౌడ్ విద్యార్థులను అభినందించి శాలువాలు, మెమొంటోలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకన్న గౌడ్ మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో స్వీయ రక్షణ కోసం విద్యార్థులు ముఖ్యంగా బాలికలు కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందడం చాలా అవసరం అన్నారు. రాష్ట్ర స్థాయిలోనూ విద్యార్థులు ప్రతిభ చూపి, జాతీయ స్థాయికి వెళ్లి విజయం సాధించి చదివిన పాఠశాలకు, పుట్టిన ఊరుకు, కన్న తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఎం. శ్రీనిధి (అండర్ -17), గోపీలత (అండర్-17), ఎం. చక్రధర్ (అండర్-14) బంగారు పతకాలు సాధించారు. అదేవిధంగా టి.అన్నవరం (అండర్-17), సి.హెచ్.విష్ణు (అండర్-17), పి.సహస్ర (అండర్-14) సిల్వర్ మెడల్స్ సాధించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, కరాటే కోచ్ శ్రీధర్ సాగర్, ప్రిన్సిపాల్స్ భార్గవ్, పులిపాటి రాధిక, పీఈటి సాయిరాం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.