చింతలపాలెం, ఫిబ్రవరి 24 : ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం మండలంలోని నక్కగూడెం గ్రామంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో నిర్మించిన నక్కగూడెం(రాగ్యానాయక్) ఎత్తిపోతల పథకం పునరుద్ధరణకు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.10 లక్షల వైద్య సౌకర్యం పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఈ నెల 27న చేవెళ్లలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకగాంధీ చేతుల మీదుగా 200 యూనిట్ల ఉచిత కరెంట్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం తాపత్రయపడే వ్యక్తి ఉత్తమ్కుమార్రెడ్డి అని అభినందించారు. మరుగునపడిన లిఫ్ట్లను పునరుద్ధరించి రైతులకు సాగునీరు అందేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో మహిళలకు వడ్డీ లేని రుణాలను, పోడు భూములకు పట్టాలను అందజేయనున్నట్లు వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. అంగన్వాడీ టీచర్లకు, ఆశ వర్కర్లకు, స్కావెంజర్లకు ప్రతి నెల జీతాలు అందజేస్తామని తెలిపారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతే హుజూర్నగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు.
నక్కగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద 3,200 ఎకరాలకు సాగునీరు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో 2012లో పథకాన్ని ఎంపిక చేసినట్లు చెప్పారు. పులిచింతల బ్యాక్ వాటర్ కింద సుమారు 1.2 కిలోమీటర్ల పొడవున పైప్లైన్ మునిగి పోవడంతో లిఫ్ట్ పునరుద్ధ్దరణ కోసం రూ.37.70 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. బెట్టతండా, రెడ్లకుంటకు కూడా లిఫ్ట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల పరిస్థితిపై పూర్తి వివరాలు తనకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. హుజూర్నగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇంతలా శ్రమించే నాయకుడు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండటం ఈ ప్రాంత ప్రజల అదృష్టం అన్నారు.
నక్కగూడెం ఎత్తిపోతల పథకం పునరుద్ధరణకు శంకుస్థాపన ముగించుకుని దొండపాడు వెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలో మంత్రులు కాన్వాయ్ దిగి రోడ్డు వెంట ఉన్న మిర్చి పంటలను పరిశీలించి.. రైతులు, కూలీలతో మాట్లాడారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, ఎస్పీ రాహుల్ హెగ్డే, సూర్యాపేట చీఫ్ ఇంజినీర్ ఓవి రమేశ్బాబు, ఆర్డీఓ జగదీశ్రెడ్డి, కోదాడ ఎస్ఈ నర్సింహారావు, ఈఈలు సత్యనారాయణ, శ్రీనివాస్, హుజూర్నగర్ డీఈ స్వామి, తాసీల్దార్ సురేందర్రెడ్డి పాల్గొన్నారు.