తిరుమలగిరి, మార్చి 8 : జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నామ మాత్రంగా మారాయి. ఆహార పదార్థాలను తనిఖీ చేసేవారే లేకపోవడంతో ఫుడ్ వ్యాపారం అడ్డూఅదుపు లేకుండా సాగుతోంది. ఫలితంగా అధికారులు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. సిబ్బంది కొరత పేరుతో తనిఖీలు నామ మాత్రంగా మారిన నేపథ్యంలో కల్తీపై అవగాహన కల్పించే వారే కరువయ్యారు. పట్టణ ప్రాంతాల్లో ప్రతి 50 వేల మందికి ,గ్రామీణ ప్రాంతాల్లో లక్ష మందికి ఒక ఆహర తనిఖీ అధికారి ఉండాలి. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో 50 మందికి పైగానే అదికారులు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. సిబ్బంది కొరత కారణంగా ఫిర్యాదులు అందినప్పుడో.. సమయం దొరికినప్పుడో.. హోటళ్లు ,దుకాణాలపై దాడులు చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా హోటళ్లు , ఫాస్ట్ పుడ్ సెంటర్లు , దాబాలు తదితరాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అంతకు మించి కొత్త ఆహారపు ఆలవాట్లు పట్టణ, పల్లె వాసులకు పరిచయం చేసి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా చైనీస్ ,ఇరాన్, అమెరికా తదితర దేశాల్లో ఆదరణలో ఉన్న ఆహార పదార్థాల విక్రయాలకు ఉత్సాహం చూపుతున్నారు. ఇదే సమయంలో పలు హోటళ్లలో లభిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతపై ఆరోపణలు వస్తున్నాయి. నిల్వ ఉంచిన ఆహర పదార్థాలను విక్రయిస్తున్నారు. మరగ బెట్టిన నూనెను రెండు రోజుల వరకు నిల్వ ఉంచి ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. రోడ్ల వెంట ఉండే మిర్చి బండ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తయారైన ఆహార పదార్థులు ఆరు బయటే ఉంచి విక్రయించటం వల్ల దుమ్మూ ధూళి చేరి జనం రోగాల బారిన పడాల్సి వస్తున్నది. అలాగా హోటళ్లలో న్యూస్ పేపర్లలో టిఫిన్లు ప్యాక్ చేయటం వల్ల పేపర్ ప్రింట్లో వాడే కెమికల్స్తో రోగాలు వచ్చే అవకాశం ఉంది.