కేతేపల్లి, ఫిబ్రవరి 22 : మండలంలోని ఇప్పలగూడెం గ్రామ శివారులో ఉన్న ఎఫ్సీఐ గోదాములో బుధవారం అగ్నిప్రమాదం సంభవించి రూ.3.68 కోట్ల విలువైన గోనె సంచులు కాలి పోయాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. రైతులు పండించిన ధాన్యాన్ని నిల్ల చేసేందుకు 2018లో మండలంలోని ఇప్పలగూడెం గ్రామ శివారులో మూసీ కుడి కాల్వ పక్కన రూ.3 కోట్ల నాబార్డు నిధులతో గోదాం నిర్మించారు. ఈ గోదాములో అధికారికంగా నిల్వలు ప్రారంభం కాలేదు. దాంతో సివిల్ సైప్లెకి సంబంధించిన 5.86 లక్షల ఖాళీ గోనె సంచులను నిల్వ ఉంచారు. యాసంగి సీజన్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ముందస్తుగా బస్తాలను సేకరించి గోదాములో నిల్వ ఉంచింది. బుధవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా గోదాములో మంటలు చెలరేగి బస్తాలకు అంటుకున్నాయి. పొగ చుట్టు పక్కల ప్రాంతాలకు వ్యాపించింది. గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. నకిరేకల్, సూర్యాపేట నుంచి రెండు ఫైరింజన్లు సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు యత్నించారు. గోదాం నిండా ఖాళీ బస్తాలు ఉండటంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఫైర్ సిబ్బంది డోర్ ద్వారా లోనికి వెళ్లేందుకు యత్నించినా సాధ్యం కాలేదు. దాంతో అధికారులు జేసీబీతో గోదాం ఒక వైపు గోడను తొలగించారు. ఆ ప్రాంతం నుంచి గోదాములోకి వెళ్లిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాలిన సంచులను జేసీబీతో సాయంతో బయటకు తీసుకువచ్చారు. కాలిపోయిన బస్తాల విలువ రూ.3.68 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. మంటల కారణంగా గోదాం గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. పైకప్పు రేకులు కూడా దెబ్బతిన్నాయి. ఘటనా స్థలాన్ని డీఎస్పీ నరసింహారెడ్డి, నకిరేకల్ రూరల్ సీఐ రాఘవరావు, తాసీల్దార మధుసూదన్రెడ్డి సందర్శించారు.
ప్రమాద కారణాలపై విచారణ
కొత్తగా గోదాం నిర్మించడంతో అందులో విద్యుత్ సౌకర్యం ఇంకా ఏర్పాటు చేయలేదు. దాంతో విద్యుత్ షార్ట్సర్క్యూట్కు అవకాశం లేదు. గోదాం చుట్టు పక్కల ప్రాంతాల్లో రైతులు మంట పెట్టిన ఆనవాళ్లు కూడా లేవు. అకస్మాత్తుగా గోదాములో మంటలు లేవడంపై అధికారులు ఆరాతీస్తున్నారు. గోదాం కిటికీలు తెరిచి ఉండడంతో ఎవరైనా కావాలనే కిటికీలోంచి గోనె సంచులకు మంటలు అంటించారా అనే విషయంపై విచారణ చేపడుతున్నట్లు తెలిసింది.