రామగిరి, డిసెంబర్ 24 : సామాజిక చరిత్రను భవిష్యత్ తరాలకు అందజేసేవే కథలు అని సినీ గేయ రచయిత సుద్దాల అశోక్తేజ అన్నారు. నల్లగొండ కథ పాఠశాల ఆధ్వర్యంలో ప్రచురించిన తెలంగాణ కథా సంకలనం ‘దురస్తు’ పుస్తకావిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కవులు, రచయితలతో కలిసి పుస్తకావిష్కరణ చేసి మాట్లాడారు. తెలంగాణ కథా రచయితలు ఆత్మగౌరవంతో తమ కథలను ప్రకటిస్తుండడం హర్షణీయమన్నారు. ప్రముఖ కవి మేరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ తెలుగు కథకు పుట్టినిల్లు నల్లగొండ అని, ఈ నేలపై తెలుగు కథ గొప్పగా వికసించిందని పేర్కొన్నారు.
తెలంగాణ నేల నుంచి ఎన్నో గొప్ప కథలు వచ్చాయని డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. డాక్టర్ పగడాల నాగేందర్ మాట్లాడుతూ దశాబ్ద కాలంగా తెలంగాణ కథను తమ సంపాదకత్వంలో వెలుగులోకి తెస్తున్న సంగిశెట్టి శ్రీనివాస్, వెల్డండి శ్రీధర్ను అభినందించారు. నల్లగొండ కథ పాఠశాల ఇంతటి గొప్ప ఆవిష్కరణలు చేయడం అభినందనీయమన్నారు. కవి, రచయిత సంగిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నల్లగొండ కథ పాఠశాల నిర్వాహకులు పెరుమళ్ల ఆనంద్, డాక్టర్ సాగర్ల సత్తయ్య, డాక్టర్ బెల్లి యాదయ్య, భూతం ముత్యాలు, ఉప్పల పద్మ, మునాస్ వెంకట్, అంబటి వెంకన్న, తండు కృష్ణకౌండిన్య, విశ్రాంత ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్ పాల్గొన్నారు.