– ఆందోళనలో దోసపహాడ్ గ్రామ రైతులు
పెన్పహాడ్, ఆగస్ట్ 25 : యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నా సంబంధిత ఫర్టిలైజర్ యాప్ మొరాయించడం రైతులకు కొత్త సమస్యగా మారింది. యూరియా అవసరమైన సమయంలో యాప్లో బుకింగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న రైతులకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. గంటల తరబడి ప్రయత్నించినా బుకింగ్ పూర్తికాక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు పంటలకు యూరియా అత్యవసరంగా అవసరమవుతుండగా, మరోవైపు యాప్ పనిచేయక పోవడంతో రైతులు ఎరువుల కోసం దుకాణాలు, అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తామేమీ చేయలేం.. యాప్ సమస్య తమ పరిధిలో లేదంటూ చేతులెత్తేస్తున్నారని పెన్పహాడ్ మండలం దోసపహాడ్ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.