నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ): కేఆర్ఎంబీకి కృష్ణానది ప్రాజెక్టులను అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ తలపెట్టిన చలో నల్లగొండ బహిరంగ సభకు విస్తృతంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ తీరుతో కృష్ణానది పరీవాహక ప్రాంతానికి జరుగనున్న నష్టంపై ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ఈ సభను నిర్వహిస్తున్నారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా ఈ సభ ద్వారా ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని విషయాలను వివరిస్తూ ప్రజలను చైతన్యం చేయనున్నారు. తద్వారా రానున్న కాలంలో రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా పోరాటాలకు ప్రజలను సన్నద్ధం చేయడమే సభ ప్రధాన లక్ష్యం. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చేలా బీఆర్ఎస్ విస్తృత ప్రచారానికి రంగంలోకి దిగింది.
ఈ నెల 13న నల్లగొండలో నిర్వహించనున్న బహిరంగ సభపై బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఇప్పటికే సభా స్థలం ఎంపిక పూర్తి కాగా అనుమతి కోసం పోలీస్ శాఖకు లేఖ అందజేసింది. నేటి నుంచి సభా స్థలంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లపై దృష్టి సారించనున్నారు. మరోవైపు సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టుల అప్పగింత వల్ల జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించడం ద్వారా వారిని స్వచ్ఛందంగా కదలివచ్చేలా చేయాలని భావిస్తున్నారు. అందుకే ముందు పార్టీ శ్రేణులను క్షేత్రస్థాయి వరకు కదిలించేలా సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారు. గురువారం ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు నియోజక వర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు, ప్రాజెక్టులకు వాటిల్లనున్న ముప్పు, దీనిపై కేసీఆర్ ఆలోచన, బహిరంగ సభ లక్ష్యం తదితర అంశాలను పార్టీ శ్రేణులకు వివరించారు.
సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా పార్టీ యావత్ రంగంలోకి దిగి చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం యాదగిరిగుట్ట, భువనగిరి, నకిరేకల్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సన్నాహక సమావేశాలు పూర్తి కాగా తుంగతుర్తిలో బుధవారమే జరిగింది. మిగతా అన్ని చోట్ల ఒకటిరెండు రోజుల్లో పూర్తి చేయనున్నారు. మరోవైపు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి నేతృత్వంలో బహిరంగ సభ ఏర్పాట్లపై కసరత్తు మొదలు పెట్టారు. ఇప్పటికే సభాస్థలాన్ని ఎంపిక చేశారు. అనుమతి కోసం కూడా పోలీసు వారికి పార్టీ పరంగా లేఖను అందజేశారు. శుక్రవారం పోలీసు శాఖ నుంచి అనుమతిపై ప్రకటన రానుందని భావిస్తున్నారు. ఆ తర్వాత చకచకా సభా వేదిక నిర్మాణం, గ్యాలరీల ఏర్పాటు, బారీ కేడింగ్, పార్కింగ్ స్థలాలను సిద్ధం చేయడం వంటి పనులన్నీ వేగవంతం కానున్నాయి. ఈ నెల 13న మధ్యాహ్నం 3గంటలకు బహిరంగ సభ జరుగనుండగా పార్టీ అధినేత కేసీఆర్ రోడ్డు మార్గంలోనే నల్లగొండకు రానున్నట్లు తెలిసింది.