– కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ కుసుమ వెంకటరత్నం బాబు
కోదాడ, జూన్ 05 : పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కోదాడ పట్టణంలోని ప్రధాన రహదారిపై డివైడర్ల మధ్య ఉన్న మొక్కలను కాపాడుకునేందుకు మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్లు, సిబ్బందితో కలిసి చైర్ పర్సన్ స్వయంగా చెట్లకు పాదులు చేసి, ఎరువులు వేసి, నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేవలం మొక్కలను నాటడమే కాకుండా, వాటిని వృక్షాలుగా మార్చే వరకు సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పచ్చని చెట్లతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని పేర్కొంటూ పట్టణ ప్రజలందరికీ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరి, కమిషనర్ రమాదేవి, డిఈ సాయి లక్ష్మి, కౌన్సిలర్లు ఎలమందల నరసయ్య, గంధం పాండు, మాజీ కౌన్సిలర్ కాజా మొయినుద్దీన్, కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు, మైలారిశెట్టి భాస్కర్, ధన మూర్తి, క్షత్రయ్య, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.