నీలగిరి, జనవరి 29 : వైద్య వృత్తి చాలా పవిత్రమైనదని, వైద్య సిబ్బంది ప్రజారోగ్యమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్నిమల్ల కొండల్రావు అన్నారు. కొత్తగా ఎంపికైన 269 మంది స్టాఫ్ నర్సులకు డీఎంహెచ్ఓ కార్యాలయంలో సోమవారం కౌన్సిలింగ్ ఇచ్చి గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా 7200 మంది స్టాఫ్ నర్సులను నియమించడం జరిగిందని, అందులో నల్లగొండ జిల్లాకు 269 మందిని కేటాయించారని తెలిపారు.
ప్రతిఒక్కరూ అంకితభావంతో పని చేయాలని సూచించారు. కొత్తగా ఎంపికైన వారికి ఈ నెల 31న సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లా నుంచి కలెక్టర్, ఎస్పీ సూచన మేరకు ఆర్టీసీ ఆర్ఎం సహకారంతో ఆరు బస్సుల్లో వారందరినీ హైదరాబాద్కు తరలిస్తామన్నారు. వారి కోసం ప్రత్యేకంగా 10 మందిని స్పెషల్ అధికారులను నియమిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది మహేశ్వరం కృష్ణయ్య, జేజాల శేఖర్రెడ్డి పాల్గొన్నారు.