సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 10 : సూర్యాపేట, కోదాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి శుక్రవారం జిల్లా ఎస్పీ కె.నరసింహ చలువ కళ్లద్దాలు, సమ్మర్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండాకాలంలో ట్రాఫిక్ విధులను నిర్వర్తించే ట్రాఫిక్ సిబ్బంది ఎండ వేడిమి నుండి సరైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సిబ్బంది ప్రతి ఒక్కరి పనితీరు గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా రోడ్లపై విధులు నిర్వర్తించేటప్పుడు తమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునే విధంగా ఈ కిట్లను అందజేయడం జరిగిందన్నారు.
విధుల పరంగానైనా, వ్యక్తిగతంగానైనా ఎలాంటి సమస్యలు తలెత్తినా తమ దృష్టికి తీసుకు రావాలని సూచించారు. ఎండ వేడిమి నుండి ఎప్పటికప్పుడు తమను తాము సంరక్షించుకోవాలంటే ఎక్కువగా నీళ్లు త్రాగాలన్నారు. ట్రాఫిక్ రూల్స్ పై నిత్యం ప్రజలకు అవగాహన కల్పిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకై భాద్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నరసింహచారి, సీఐలు వెంకటయ్య, శివశంకర్, రిజర్వ్ సీఐ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐలు సాయిరాం, అంజిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.