సూర్యాపేట రూరల్, ఫిబ్రవరి 19 : విద్యార్థులకు పాఠాలు బోధించడమే కాకుండా వారి నడవడికను ఉపాధ్యాయులు గమనించాలని సైకాలజిస్ట్లు స్రవంతి, అనిల్కుమార్ సూచించారు. సూర్యాపేట మండలంలోని ఇమాంపేట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో జరుగుతున్న వరుస ఆత్మహత్యల నేపథ్యంలో కలెక్టర్ నియమించిన మానసిక నిపుణుల కమిటీ సభ్యులు సోమవారం పాఠశాలను సందర్శించి విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మానసిక పరిస్థితిపై విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చి వారిలో ఆత్మైస్థెర్యాన్ని పెంచాలని సూచించారు.
ఒక్కొక్క విద్యార్థికి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చి వారిలో మానసిక దృఢత్వాన్ని కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. విద్యార్థులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని కోరారు. అలాగే వారికి నాణ్యమైన భోజనం పెట్టడం లేదని పలుమార్లు తమతో చెప్పినట్లు తల్లిదండ్రులు తెలిపారు. అనంతరం పాఠశాలలోని వసతులు, తరగతి గదులు, భోజన శాలను క్షుణ్నంగా పరిశీలించారు. ఈ కౌన్సెలింగ్ వారం పాటు కొనసాగుతుందని, ప్రతి విద్యార్థి ప్రవర్తనపై కమిటీ విచారణ చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు డాక్టర్ ఉమామహేశ్వరి, పద్మజ, జ్యోతిపద్మ, అరుణకుమారి, ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీలత పాల్గొన్నారు.