నకిరేకల్, మార్చి 10: ఉగాది సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహ ప్రవేశాలు చేసేందుకు ఎక్కడైనా చివరి దశలో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేసి సిద్ధం చేయాలని, వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ కాకుండా చూసుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రంలోని నారాయణరెడ్డి ఫంక్షన్ హాల్లో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి 15 రోజులు అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల సమస్యల పరిష్కార కార్యక్రమం చేపట్టాలన్నారు.
సమస్యలు లేని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. గ్రామ వార్డు సభ్యులు, కౌన్సిలర్లతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని పారిశుధ్య సమస్యలు, ఇతర సమస్యలపై సమీక్షించుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి జాబితాను చదివి వినిపించాలన్నారు. ఎంపీడీవోలు, తహసీల్దార్లు ముందుగానే నివేదిక సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
గ్రామాల్లోని డంపింగ్ యార్డులు, పార్కులను వినియోగంలోకి తీసుకురావాలన్నారు. పాఠశాలలు, హాస్టళ్లు, ఇతర సంస్థల్లో ఫుడ్ పాయిజన్ కాకుండా చూసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ ‘సురక్షితంగా చేరుకోండి. యువత డ్రగ్స్ బారిన పడకుండా పోలీసు శాఖ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం’ అని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల వీరేశం, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్, నల్లగొండ ఆర్డీవో అశోక్రెడ్డి, నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ చౌగోని రజిత శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల పాల్గొన్నారు.