నల్లగొండ : అరవై ఏండ్ల తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసిన కారణజన్ముడు కేసీఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
నియోజకవర్గంలోని రామన్నపేట, నకిరేకల్ మండల కేంద్రాలలో అన్నదాన కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజల 60 సంవత్సరాల కలను సాకారం చేసి రాష్ట్రాన్ని సాధించిన మరో గాంధీ కేసీఆర్ అని ఆయన అన్నారు.
మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహనీయుల బాటలో నడుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారని అన్నారు.
కేసీఆర్ అంటే వ్యక్తి కాదు 4 కోట్ల ప్రజల గుండె చప్పుడు అని అన్నారు. కేసీఆర్ ఆదర్శ నాయకత్వ పటిమతో పల్లెలన్నీ ప్రగతి పథంలో నడుస్తున్నాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
దేశమంతా దద్దరిల్లేలా కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. రేపు నకిరేకల్ మండల కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసామని ఆయన తెలిపారు.