మహిళల ఆర్థిక స్వావలంబనతో ఆ కుటుంబం.. తద్వారా సమాజం ఆర్ధిక పురోభివృద్ధి సాధిస్తుందని నమ్మే నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకోసమే ఎక్కువ సంక్షేమ పథకాలను మహిళల పేరుతో రూపొందించినట్లు చెప్పారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేటలో మంగళవారం జరిగిన మహిళా సంక్షేమ దినోత్సవ సంబురాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళా సాధికారతకు గట్టి పునాదులు వేసి ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా పక్షపాతిగా పేరొందారన్నారు.
కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో మాతా శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గడం సర్కారు కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. 2014కు ముందు లెక్కలతో చూస్తే గృహహింస 6శాతానికి తగ్గిందని వెల్లడించారు. లింగ నిర్ధ్దారణపై సంపూర్ణ నిషేధం, నిందితులపై పీడీ యాక్ట్ చర్యలతో బాలికల జననాలు పెరిగినట్లు చెప్పారు. షీటీమ్స్ మహిళలకు రక్షణ కల్పించడంతోపాటు వారిలో మనోధైర్యాన్ని ఇనుమడింపజేసినట్లు పేర్కొన్నారు. చరిత్రలోనే మొట్టమొదటి సారిగా పోలీస్ ఉద్యోగాల్లో, మార్కెట్ కమిటీ నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించిన మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. మరోవైపు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మహిళా సంక్షేమ దినోత్సవాలు సంబురంగా సాగాయి. బోనాలు, బతుకమ్మలతో మహిళలు ఉత్సాహంగా కార్యక్రమాలకు హాజరయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు భాగస్వాములై మహిళా సంక్షేమానికి సర్కారు చేస్తున్న కృషిని వివరించారు.
సూర్యాపేట టౌన్, జూన్ 13 : మహిళల ఆర్థిక స్వావలంబనతో ఆ కుటుంబం.. తద్వారా ఆ సమాజం ఆర్థికాభివృద్ధి సాధిస్తుందని నమ్మే నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో ఎక్కువగా మహిళల కోసం మహిళల పేరుతో రూపొందించారని తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళశారం సూర్యాపేటలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి జ్యోతిపద్మ అధ్యక్షతన జరిగిన మహిళా దినోత్సవ సంబురాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కుటుంబ స్వామ్యంలో మహిళల పాత్ర కీలకమన్నారు. ఏ ఇంట్లో అయితే మహిళ ఆర్థిక పొదుపు పాటిస్తుందో అది ఆ కుటుంబానికే కాదు.. ఆ సమాజానికి తద్వారా ఆ రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాదులు పడుతామని పేర్కొన్నారు.
మహిళల పక్షపాతిగా ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదేండ్లలో మహిళా సాధికారతకు గట్టి పునాదులు వేశారని తెలిపారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో మాతా శిశు మరణాల సంఖ్య తగ్గడమే ఇందుకు తార్కాణమన్నారు. గృహ హింస 2014 తర్వాత 6శాతానికి తగ్గిందని వెల్లడించారు. లింగ నిర్ధ్దారణపై సంపూర్ణ నిషేధం విధించడంతోపాటు పీడీ యాక్ట్తో కట్టడి చేయడంతో బాలికల జననాలు ఘనంగా పెరిగాయన్నారు. షీటీమ్స్ మహిళలకు రక్షణ కల్పించడంతోపాటు వారిలో మానసిక ధైర్యాన్ని ఇనుమడింపజేశాయన్నారు. మొట్టమొదటి సారిగా పోలీస్ ఉద్యోగాల్లో, రాజకీయంగా మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు కల్పించిన మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. విద్యుత్ లైన్ఉమెన్లను 300 మందిని నియమించారని తెలిపారు.
2014, 2018 ఎన్నికల్లో మహిళలు ఆశీర్వదించి అధికారం అప్పగించినందునే మహిళలకు ఇంతటి సంక్షేమం అని చెప్పారు. ఆరోగ్యలక్ష్మి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 20.72లక్షల గర్భిణులు, 18.42లక్షల మంది బాలింతలు, 97.49లక్షల మంది 7సంవత్సరాల నుంచి మూడేండ్ల వరకు చిన్నారులు, 3నుంచి 6సంవత్సరాల్లోపు ఉన్న పిల్లలు 55.86లక్షల మది లబ్ధి పొందారని వివరించారు. అంగన్వాడీ సూపర్వైజర్లుగా విధులు నిర్వహిస్తున్న 149మందిని క్రమబద్ధీకరించడంతోపాటు అంగన్వాడీ సిబ్బందికి 300శాతం గౌరవ వేతనాలు పెంచినట్లు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆసరా పింఛన్లు పెంచామని, తాజాగా దివ్యాంగులకు మరో వెయ్యి పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారని తెలిపారు.
సూర్యాపేట నియోజకవర్గంలోనే 1,725 మంది ఒంటరి మహిళలకు ఇప్పటి వరకు 18.83కోట్లు, 14,735 మంది వితంతువులకు 195.54కోట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. 11,413మంది మహిళా వృద్ధులు, 6,883 మంది మహిళా దివ్యాంగులు, 78మంది చేనేత మహిళలు ఆసరా పింఛన్లు పొందుతున్నట్లు తెలిపారు. ఆరోగ్య మహిళా పథకంలో 4,160 మంది మహిళలకు పరీక్షలు నిర్వహించి, అందులో 413మందిని ఉన్నత ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స అందించినట్లు చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద 10,052 మందికి 92,09,20,382 రూపాయలు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. షీటీమ్స్తో మహిళల్లో అత్మన్యూనతా భావం తగ్గి ఆత్మైస్థెర్యం పెరిగిందన్నారు. గృహ హింస, లైంగిక వేధింపుల నుంచి మహిళల రక్షణకు ప్రత్యేకంగా సూర్యాపేటలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రంలో మహిళలకు భరోసా కలిగిందని చెప్పారు.
సఖి కేంద్రంలో 87మంది బాధితులకు నాలుగు కోట్ల లక్షా 5వేలు చెల్లించగా.. మరో 42మందికి 10.75లక్షలు చెల్లించినట్లు తెలిపారు. కేసీఆర్ కిట్ కింద నియోజకవర్గంలో 14,577 మంది లబ్ధిదారులకు 12.93కోట్లు ఖర్చు చేయగా.. న్యూట్రిషన్ కిట్ ద్వారా 561మందికి 11.10లక్షలు ఖర్చు పెట్టినట్లు మంత్రి చెప్పారు. సూర్యాపేటలో త్వరలో మహిళా భవన్తోపాటు పాత మార్కెట్ యార్డు ప్రాంగణంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో మహిళల కోసం ప్రత్యేకంగా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, బీఆర్బీ భవన్, సఖి కేంద్రం, వృద్ధ్దాశ్రమం, ఈసీడీసీ భవనంతోపాటు బాలరక్ష భవనాలు నిర్మించతలపెట్టినట్లు మంత్రి జగదీశ్రెడ్డి ప్రకటించారు.
మహిళా సాధికారత మరింత పురోభివృద్ధి చెందాలంటే అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే శరణ్యమన్నారు. 2014 తరువాత ప్రతి సందర్భంలోనూ మహిళలు ముఖ్యమంత్రి కేసీఆర్కు బాసటగా నిలిచారని, భవిష్యత్లోనూ అలాగే ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అంతకుముందు మహిళలు బతుకమ్మలు, బోనాలతో ధూంధాం నిర్వహించారు. సేంద్రీయ ఎరువులతో పండించిన కూరగాయలతో పేర్చిన బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, చివ్వెంల ఎంపీపీ ధరావత్ కుమారి, పెన్పహాడ్ జడ్పీటీసీ మామిడి అనిత, ఆత్మకూర్.ఎస్ తాసీల్దార్ పుష్ప, మున్సిపల్ కౌన్సిలర్లు ఆకుల కవిత, మాలోతు కమల, కుంభం రేణుక, జాటోతు లక్ష్మి, నిమ్మల స్రవంతి, కొండపల్లి భద్రమ్మ, ధరావత్ నీలాబాయి, బత్తుల లక్ష్మి, జ్యోతి శ్రీవిద్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శిరీష, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ శారద, మహిళా ఉద్యోగులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.