యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) ;ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన మెట్ల బావులను సుందరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్లోని బన్సీలాల్ పేటలో ఉన్న మెట్లబావిని అందంగా ముస్తాబు చేసింది. ఇందులో భాగంగా జిల్లాలోని మెట్లబావిపై సర్కారు దృష్టి పెట్టింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మూడుచోట్ల ఉన్న రాయగిరి, రాచకొండ, భువనగిరిలోని మెట్ల బావులకు మరమ్మతులు చేపట్టి అద్భుతంగా మార్చేందుకు శ్రీకారం చుట్టింది. వీటి పనులు వేగంగా జరుగుతున్నాయి.
రాచకొండ మెట్లబావిలో క్లీనింగ్ పూర్తి
పద్మనాయక వంశీయులైన రాజుల్లో ఒకరైన అనపోతననాయుడు రాచకొండలోని చారిత్రాత్మకమైన గాలిబ్ షహీద్ దర్గా, పెద్దమ్మ గుడి వద్ద ప్రజల దాహార్తి తీర్చేందుకు మెట్లబావులను నిర్మించారు. ఇందులో దర్గా వద్ద ఉన్న మెట్ల బావిని ఆధునీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సైతం ముందుకొచ్చారు. బావిలోని నీటిని ఇప్పటికే పూర్తిగా తొలగించారు. చెత్తచెదారం, బురదను బయటకు తోడారు. నీరు మళ్లీ పైకి ఊట వస్తుండటంతో నిపుణులతో చర్చించాలని అధికారులు నిర్ణయించారు. మెట్లబావి వద్ద ఫినిషింగ్, విద్యుద్దీకరణ పనులు చేయాల్సి ఉంది. మహా శివరాత్రి సందర్భంగా రాచకొండ గుట్టలో మూడు రోజులపాటు అత్యంత వైభవంగా ఉర్సు, మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల నాటికి దర్గా వద్ద ఉన్న బావి పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.
రాయగిరిలో సగానికి పైగా పనులు పూర్తి
యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని రాయగిరిలో కోనేరు(మెట్లబావి) ఉన్నది. ఇది 16వ శతాబ్దం నాటిదని చరిత్రకారులు చెబుతున్నారు. చతురస్రాకారంలో, బోర్లించిన పిరిమిడ్లా కనిపిస్తుంది. బావి ప్రారంభంలో ఓ మండపం ఉంటుంది. గుట్ట ఉత్సవాల సమయంలో దేవుతామూర్తుల విగ్రహాలకు ఇక్కడే చక్రతీర్థ స్నానం చేయిస్తారు. ఇప్పుడు ఈ కోనేరు అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నది. గుట్టకు వచ్చే భక్తులు దర్శనం చేసుకుని మెట్లబావిని సందర్శించేలా అందంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం పట్టణ ప్రగతి కింద దీని పనులు చేపడుతున్నారు. ఇప్పటికే చెత్త, చెదారం, కంపచెట్లు తొలగించారు. సిమెంట్, సున్నం వేశారు. సగానికిపైగా సుందరీకరణ పనులు పూర్తయ్యాయి. ఇక్కడే ప్రత్యేకంగా ఓ ట్రాన్స్ఫార్మర్, 13కరెంట్ స్తంభాలను ఏర్పాటు చేయనున్నారు. సీసీ రోడ్లు వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. చౌటుప్పల్లోని మిషన్ భగీరథ పైలాన్లో ఉన్నట్లుగా ఇక్కడ పార్కు ఏర్పాటు చేయనున్నారు.
కలెక్టర్ ప్రత్యేక చొరవ..భువనగిరి పట్టణంలో..
భువనగిరి పట్టణంలోని మసీదు వద్ద ఉన్న మెట్లబావిని కూడా అభివృద్ధి చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇటీవల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి పరిశీలించారు. ఇది ఆర్కియాలజీ శాఖ పరిధిలో ఉండటంతో వారి అనుమతి తప్పనిసరి. దాంతో అనుమతి కోసం మున్సిపల్ శాఖ రెండు రోజుల క్రితం ఆర్కియాలజీ శాఖకు లేఖ కూడా రాసింది. అనుమతులు రాగానే ఇక్కడ పనులు చేపట్టనున్నారు. బావిలోని నీటిని డీవాటరైజ్ చేయనున్నారు. ప్రత్యేకంగా బోర్ వేయాలని అధికారులు నిర్ణయించారు. చిన్నచిన్న రిపేర్లు చేయనున్నారు. లైటింగ్ సిస్టం, బాత్రూమ్ల నిర్మాణం జరుగనుంది. చివరగా పార్కును తీర్చిదిద్దనున్నారు.