రామగిరి, డిసెంబర్ 27 : ప్రణాళికయుతంగా చదివితే సివిల్స్లో విజయం సాధించడం చాల సులభమని సీనియర్ ఫ్యాకల్టీలు గంపా నాగేశ్వర్రావు, బాలలత, వేముల శ్రీనివాస్, కృష్ణప్రదీప్ అన్నారు. నల్లగొండలోని లక్ష్మి గార్డెన్స్లో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో పట్టణంలోని జూనియర్, డిగ్రీ విద్యార్థులకు సివిల్స్, ఇతర ఉద్యోగాల పరీక్షల్లో విజయ సాధనపై నిర్వహించిన ‘ఇంపాక్ట్’ ప్రొగ్రామ్కు వారు హాజరై మాట్లాడారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రణాళికతో చదువాలన్నారు. చదివే సమయంలో విశ్లేషణాత్మకంగా చదువుతూ సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలని సూచించారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ 320E గవర్నర్ తీగల మోహన్రావు మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు అప్డేట్ అయి విజయం సాధించాలనే సంకల్పంతోనే ఇంపాక్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బుధవారం కార్యక్రమానికి జెడీ లక్ష్మీనారాయణ, ఫ్యాకల్టీ సత్యవాణితో పాటు ఇతర సీనియర్ ఫ్యాకల్టీలు హాజరవుతున్నట్లు వెల్లడించారు. వివిధ రంగాల్లో నిపుణులైన వారితో నిర్వహించే అవగాహన సదస్సును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్, జయసింహ, జగన్ గురూజీ మాట్లాడుతూ ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో చదువాలని అప్పుడే జీవిత లక్ష్యం చేరుకోవడం సులభమన్నారు. లయన్స్ మాజీ జిల్లా గవర్నర్ జగిని భీమయ్య, వీడీజీలు శివప్రసాద్, యారాల ప్రభాకర్రెడ్డి, బండాసాగర్రెడ్డి పాల్గొన్నారు.