సూర్యాపేట, జూన్ 2 : తెలంగాణ ప్రజల కన్నీళ్లు, కష్టాలను చూసి చలించిన కేసీఆర్ 2001లో బీఆర్ఎస్ పార్టీని స్థాపించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి నాంది పలికారని, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని 36 పార్టీలను ఒప్పించి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినట్లు మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా సోమవారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జాతీయ పతాకాన్ని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లుతో కలిసి ఎగురవేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనలను, బీఆర్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. సాగునీరు, తాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్, నిరుపేద విద్యార్థులకు గురుకులాలను ఏర్పాటు చేసి బడుగు, బలహీన సబ్బండ వర్గాల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు కేటాయించి తెలంగాణను అన్ని రంగాల్లో దేశానికి రోల్ మోడల్ చేసినట్లు తెలిపారు.
నేడు తెలంగాణలో ముఖ్యమంత్రి, మంత్రులు తమ పదవులు కేసీఆర్ చలువే అని గుర్తుంచుకోవాలన్నారు. అమలుకు సాధ్యం కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన అస్తవ్యస్తంగా తయారయిందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు దోచుకునే పనిలో ఉన్నారని, కమీషన్లు లేనిదే పనులు చేయడం లేదన్నారు. పదేళ్లపాటు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్న కేసీఆర్ ను ప్రజలంతా నేడు దేవులాడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, మాజీ జడ్పీటీసీ జీడీ భిక్షం, పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Suryapet : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే : బడుగుల లింగయ్యయాదవ్